నీతా అంబానీ భాబీ..ఇది ట్రైలర్ మాత్రమే: కారులో ముంబై ఇండియన్స్ బ్యాగ్..బెదిరింపు లేఖ
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ నివాసం.. ఆంటిలియా వద్ద చోటు చేసుకున్న సంఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నారు. దీనికోసం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు సైతం దర్యాప్తులో భాగస్వామ్యమయ్యారు. ఆంటిలియా వద్ద పార్క్ చేసి ఉంచిన ఆకుపచ్చ రంగు స్కార్పియో కారులో లభించిన జిలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి లభించాయనే విషయంపై ఆరా తీస్తోన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆంటిలియా వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
బెదిరింపు లేఖను ధృవీకరించిన ముంబై పోలీసులు
కారులో లభించిన కొన్ని అనుమానాస్పద వస్తువులు, బెదిరింపు లేఖ లభించినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ క్రికెట్ టీమ్ ముంబై ఇండియన్స్ లోగోను ముద్రించిన ఓ బ్యాగులో ఈ లెటర్ లభించింది. ఈ క్రికెట్ టీమ్కు ముఖేష్ అంబాని భార్య నితా అంబాని యజమానిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. డ్రైవర్ సీటులో ఉంచిన ముంబై ఇండియన్స్ బ్యాగులో ఈ లెటర్ లభించిందని ముంబై పోలీసుల అధికార ప్రతినిది, డిప్యూటీ కమిషనర్ చైతన్య సిరిప్రోలు తెలిపారు.
ఇది ట్రైలర్ మాత్రమే..
ఇది ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ లేఖలో రాసి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ లేఖలో ముఖేష్ అంబాని, నీతా అంబాని పేర్లను ప్రస్తావించారని చెప్పారు. నీతా భాబీ, ముఖేష్ భయ్యా! ఇది ట్రైలర్ మాత్రమే. ఇదొక ఝలక్. ఈ సారి ఈ సామాన్లు (పేలుడు వస్తువులు) నేరుగా మీ వద్దకే వస్తాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. అని ఈ లేఖలో రాసి ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ లేఖ లభించిన తరువాత.. దీన్ని తాము తేలిగ్గా తీసుకోవట్లేదని చెప్పారు. దీని వెనుక కుట్ర కోణం ఉందనేది స్పష్టమైందని అన్నారు.
కారు పార్క్ చేసిన వ్యక్తి నుంచే సమాచారం..
ముంబైలో పెడ్డర్ రోడ్లోని ముఖేష్ అంబాని నివాసం ఆంటిలియాకు 600 మీటర్ల దూరంలో పార్క్ చేసి ఉంచిన పేలుడు పదార్థాలు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్.. దాన్ని పార్క్ చేసిన వ్యక్తే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఈ సమాచారం ఇవ్వకపోయి ఉంటే.. ఆ కారు మీద పెద్దగా ఎవరి దృష్టి పడి ఉండేది కాదని, అందులో పేలుడు వస్తువులు ఉన్నవిషయం బహిర్గతం కావడంలో మరింత జాప్యం జరిగి ఉండేదనే అంచనాలు ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ ఎస్యూవీ కారును ఎవరు పార్క్ చేశారనేది ఇంకా తెలియరాలేదు. దీనికోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టారు.
నెల రోజుల కిందటే రెక్కీ..
పేలుడు పదార్థాలు ఉంచిన కారును ఆంటిలియో సమీపంలో పార్క్ చేసి ఉంచడానికి నెల రోజుల కిందటే ఓ సారి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తోన్నారు. జిలెటిన్ స్టిక్స్ నింపి ఉన్న స్కార్పియోను మరో తెల్లరంగు కారు అనుసరించడం, కొంతసేపటి తరువాత ఆ కారు ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. స్కార్పియో వచ్చి ఆగిన చాలాసేపటి వరకు డ్రైవర్ అందులోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సీసీటీవీ ఫుటేజీలను ముంబై పోలీసుల నుంచి యాంటీ టెర్రరిస్ట స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.