అర్నబ్ గోస్వామి మళ్లీ- బెయిల్ పొడిగించిన సుప్రీంకోర్టు- స్వేచ్ఛ కొందరికే పరిమితం కాదని వ్యాఖ్య
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై దాఖలైన ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సుప్రీంకోర్టులో మరోసారి ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న అర్నబ్ గోస్వామికి ఊరటనిస్తూ దీన్ని సుప్రీంకోర్టు పొడిగించింది. అదే సమయంలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టులను లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మార్గాలు, వనరులు లేని సాధారణ పౌరులు జైళ్ళలో అండర్ ట్రయల్ ఖైదీలుగా కొట్టుమిట్టాడుతున్నారని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. "ఒక రోజు స్వేచ్ఛను కోల్పోవడం కూడా చాలా ఎక్కువ" అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాతో కూడిన ధర్మాసనం ఇవాళ వెలువరించిన 55 పేజీల తీర్పులో పేర్కొంది. పౌరులను వేధించడానికి నేర చట్టాన్ని ఉపయోగించటానికి రాష్ట్రాన్ని అనుమతించరాదని ఈ కేసులో తీర్పు చెప్పిన జస్టిస్ చంద్రదూడ్ హెచ్చరించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 91,568 బెయిల్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేసిన జస్టిస్ చంద్రచూడ్.. జిల్లా కోర్టులోనూ 1.96 లక్షల బెయిల్ పిటిషన్ల పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అటు అర్నబ్ కేసులోనూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై పెట్టిన కేసును గమనిస్తే ఆయన పాత్రకు సంబంధించిన ప్రాధమిక ఆధారాలు కనిపించడం లేదని సుప్రీం ధర్మాసనం పరోక్షంగా వ్యాఖ్యానించింది. తనకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ జస్టిస్ను దుర్వినియోగం చేసుస్తున్నట్లు ప్రాధమిక ఆధారాలు కలిగి ఉన్నంతసేపు సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయని తెలిపింది.