ఎల్ ఐసీకి సుప్రీం కోర్టు షాక్
న్యూఢిల్లీ/నాగ్ పూర్: నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎల్ఐసీ)కి దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) షాక్ ఇచ్చింది.
1991లో ఉద్యోగాల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు వారికి అందాల్సిన వేతనాలను చెల్లించాలని ఆదేశించింది.
ఎల్ఐసీలో 1991లో దేశ వ్యాప్తంగా రెగ్యులర్ చెయాల్సిన మూడో, నాలుగో తరగతులకు చెందిన 8 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. దీంతో వారందరూ ఆల్ ఇండియా నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ద్వారా కోర్టును ఆశ్రయించారు.
2015 మార్చి 18వ తేదిన కాంట్రాక్టు ఉద్యోగులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. తరువాత ఎల్ఐసీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 25 ఏళ్ల వేతనాలు రూ. 7,083 కోట్లు ఒకే సారి చెల్లించడం ఎల్ఐసీకి భారం అవుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు.
50 శాతం వేతనాలతో పాటు తదనంతర పరిణామాలకు కారణమైనందుకు అడిషనల్ బెనిఫిట్స్ ఉద్యోగులకు ఇవ్వాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
గత 25 సంవత్సరాల నుంచి ఉద్యోగులు వేచి చూస్తున్నారని, ఎనిమిది వారాల్లోగా వారికి రావలసిన బకాయిల్లో 50 శాతం (రూ. 3,543 కోట్లు) చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగాలు కొల్పోయిన వారు సుప్రీం కోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.