ఉగ్రదాడి: కల్నల్ నిరంజన్ అమర్ రహే (వీడియో)
బెంగళూరు: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరుడైన లెప్టినెంట్ కల్నల్ కే. నిరంజన్ కుమార్ మృతదేహాన్ని ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఎఎల్ విమానాశ్రయంలోకి తీసుకు వచ్చారు.
తరువాత హెచ్ఏఎల్ సమీపంలోని దోమ్మలూరులోని కమాండో ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం నిరంజన్ కుమార్ మృతదేహాన్ని బెంగళూరులోని బీఇఎల్ సర్కిల్ సమీపంలోని దోడ్డ బోమ్మసంద్రలోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు.
ఆర్మీ జవాన్లతో పాటు పోలీసులు, స్థానికులు పెద్ద ఎత్తున నిరంజన్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన నిరంజన్ కుమార్ అమర్ రహే అంటూ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అంతిమ దర్శనం చేసుకున్నారు.
అనంతరం బీఇఎల్ మైదానంకు తరలించి ప్రజల అంతిమ దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. సోమవారం కేరళలోని పాలక్కాడ్ లో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
శనివారం నుంచి పఠాన్ కోట్ లో ఉగ్రవాదులతో నిరంజన్ కుమార్ పోరాడుతున్నారు. ఆదివారం జవాన్ల కాల్పులలోమరణించిన ఉగ్రవాదికి అమర్చిన గ్రేనేడ్ నిర్వీర్యం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలిపోయి నిరంజన్ కుమార్ మరణించారు.
నిరంజన్ కుమార్ తండ్రి శివరాజన్ అనేక సంవత్సరాల క్రితం కేరళ నుంచి బెంగళూరు చేరుకుని బీఇఎల్ లో ఉద్యోగం చేసేవారు. శివరాజన్ కు నలుగురు సంతానం. నిరంజన్ కుమార్ రెండవ కుమారుడు. పెద్ద కుమారుడు శరత్ చంద్ర ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నారు.
బెంగళూరులోని మల్లేశ్వరంలోని బీపి ఇండియన్ పబ్లిక్ స్కూల్ లో నిరంజన్ కుమార్ విద్యాభ్యాసం చేశారు. 12 సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరారు. ఎన్ఎస్ జీ కమాండోగా పని చేస్తున్న నిరంజన్ కుమార్ గత సంవత్సరంలో బాంబు నిర్వీర్యదళంలో చేరారు.
నిరంజన్ కుమార్ కు భార్య రాధికా, కుమార్తె విస్మయ (చిన్నారి) ఉన్నారు. ప్రభుత్వ లాంచనాలతో నిరంజన్ కుమార్ అంత్యక్రియలు ఆయన సొంత ప్రాంతం అయిన పాలక్కాడ్ లో నిర్వహిస్తామని మిలటరీ అధికారులు తెలిపారు.