మళ్లీ జీరో నుంచి ఆరంభించాల్సిందే: స్వస్థలాలకు వెళ్లినా.. ఆకలితో పస్తులుండాల్సిందే
పాట్నా: కరోనా వైరస్ లక్షలాది మంది వలస కార్మికుల పొట్ట కొట్టింది. వాళ్లను రోడ్ల మీద పడేసింది. నిలువ నీడ లేకుండా చేసింది. కాలే ఎండల్లో.. ఖాళీ కడుపులతో వందలాది కిలోమీటర్ల దూరాన్ని కాలినడక అధిగమించేలా చేస్తోంది. పోనీ- స్వస్థలానికి వెళ్లిన తరువాతైనా వారు క్షేమంగా ఉంటారనుకోవడం భ్రమే అవుతుంది. అక్కడా తిండి దొరకని పరిస్థితి. ఈ పరిస్థితి వారికి తెలియనిది కాదు.. ఇంటికి వెళ్లినా మంచినీళ్లు కూడా దొరకదనే విషయం వారికి తెలుసు. తల్లి లాంటి పల్లె ఒడికి చేరుకోవాలనే ఒకే ఒక్క ఆశ వారిని వందలాది కిలోమీటర్లు నడిపిస్తోంది.
లక్షలాది మంది జీవితాలపై కరోనా కాటు..
లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసింది కరోనా వైరస్. తమ జీవితాన్ని మళ్లీ జీరో నుంచి ఆరంభించేలా చేసింది. కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతే గానీ నిర్మణ పనులు పునః ప్రారంభం కావు. పునఃప్రారంభమైనప్పటికీ.. పరిమిత సంఖ్యలోనే కార్మికులను తీసుకోవాల్సి రావడం ఖాయంగా కనిపిస్తోంది. భవన నిర్మాణరంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు కరోనా ప్రభావానికి గురయ్యాయి. ఫలితంగా- ఇక ఎప్పుడు పనులు ప్రారంభమౌతాయనే సందిగ్ధత, భయాందోళనలను వలస కార్మికుల్లో వ్యక్తమౌతున్నాయి.
రోజూ రూ. 400 సంపాదన..
తాను ఐఐటీ-హైదరాబాద్ క్యాంపస్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండేవాడినని, రోజూ 400 రూపాయలను సంపాదించే వాడనని జార్ఖండ్కు చెందిన వలస కార్మికుడు అజయ్ మాంఝీ తెలిపాడు. తన ఖర్చులు పోనూ ముప్పావు భాగం వేతనాన్ని ఇంటికి పంపించేవాడినని అన్నాడు. సరాయ్కేలా జిల్లాలోని ఛోటా అమ్రా గ్రామానికి చెందిన అతను కొద్దిరోజుల కిందటే స్వస్థలానికి చేరుకున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ద్వారా తాను జార్ఖండ్కు చేరుకున్నానని, ఇక్కడా పస్తులతోనే కాలం గడపాల్సి వస్తోందని చెప్పాడు. భవన నిర్మాణరంగం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నందున తాను హైదరాబాద్ను ఎంచుకున్నానని చెప్పాడు. గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను నమ్ముకున్నానని అన్నాడు.
వెనక్కి పోదలచుకోలేదు..
కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత కూడా తాను మళ్లీ నిర్మాణరంగ పనులను నమ్ముకుని వెనక్కి వెళ్లదలచుకోలేదని ఛత్తీస్గఢ్ నంద్గావ్కు చెందిన వలస కార్మికుడు కమలేష్ సాహు తెలిపాడు. ఇదివరకు అతను హైదరాబాద్లో ఓ కాంట్రాక్టర్ కింద పని చేసేవాడు. లాక్డౌన్ వల్ల పనులు లేకపోవడంతో స్వస్థలానికి తిరుగుముఖం పట్టాడు. కొంతదూరం నడుచుకుంటూ.. మరికొంత దూరం ట్రక్కుల్లో స్వస్థలానికి చేరుకున్నట్లు చెప్పాడు. నెలకు అయిదువేల రూపాయలను సంపాదించేవాడినని, ఇక ఆ మొత్తం కోసం కుటుంబాన్ని వదిలి అంతదూరం వెళ్లట్లేదని అన్నాడు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని జీవితాన్ని పునఃప్రారంభిస్తానని అంటున్నాడు.
Recommended Video
వాటర్ క్యాన్లను సరఫరా చేస్తూ..
హైదరాబాద్లో ఇంటింటికీ వాటర్ క్యాన్లను సరఫరా చేస్తూ రోజూ 300 రూపాయలను సంపాదించే వాడినని మధ్యప్రదేశ్ ఛితారి గ్రామానికి చెందిన గజ్రాజ్ యాదవ్ తెలిపాడు. లాక్డౌన్ వల్ల ఉపాధిని కోల్పోవడంతో స్వస్థలానికి చేరుకున్నానని అన్నాడు. తమ గ్రామంలో చేయడానికి ఎలాంటి పనులు లేవని, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే.. దాన్ని తీర్చే పరిస్థితి లేదని వాపోయాడు. లాక్డౌన్ ముగిసిన తరువాత మళ్లీ హైదరాబాద్కే వెళ్లే ఆలోచనలో ఉన్నానని, వాటర్ క్యాన్లను సరఫరా చేసే పని తనకోసం ఇంకా ఉంటుందని అనుకోవట్లేదని, అది లేకపోయినా హైదరాబాద్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశ తనకు ఉందని అన్నాడు.