మరో మహమ్మారి.. ఎయిడ్స్ కంటే 19 రెట్లు ఎక్కువ మరణాలు.. యూపీ పరిస్థితి మరీ దారుణం..
వాయు కాలుష్యం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సమస్యగా మారుతోంది. కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా అవేవీ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో కాలుష్య కోరల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య,అలాగే ఆయు ప్రమాణం తగ్గిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా మనుషుల్లో సగటున మూడేళ్ల ఆయు ప్రమాణం పడిపోయినట్టుగా కార్డియోవస్క్యులర్ రీసెర్చ్ అనే జర్నల్ తాజాగా షాకింగ్ కథనాన్ని ప్రచురించింది.
భారత్లో వాయు కాలుష్యం ఎఫెక్ట్.. యూపీలో తీవ్ర స్థాయిలో
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా మనుషుల్లో సగటున మూడేళ్ల ఆయు ప్రమాణం పడిపోగా.. ఆసియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చైనాలో అది 4.1 సంవత్సరాలు,ఇండియాలో 3.9,పాకిస్తాన్లో 3.8గా ఉంది. భారత్లో మిగతా రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్లో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. దాదాపు 20కోట్లు మంది నివసించే యూపీలో వాయు కాలుష్యం కారణంగా సగటున 8.9 సంవత్సరాల ఆయు ప్రమాణం పడిపోయినట్టుగా చికాగోకి చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్లో వెల్లడైంది. ఇక 7.4 కోట్ల జనాభా కలిగిన చైనాలోని హుబెయ్ ప్రావిన్స్లో ఆయు ప్రమాణం ఆరేళ్లుగా పడిపోయినట్టుగా తెలిపింది.
ఏటా 80లక్షల మరణాలు
ఆఫ్రికా దేశాల్లో సగటున 3.1 ఏళ్ల ఆయు ప్రమాణం పడిపోయినట్టు వెల్లడైంది. సియెరా,లియోన్,సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్,నైజీరియా వంటి దేశాల్లో అది 4.5శాతం నుంచి 7.3శాతం వరకు ఉండటం గమనార్హం. మిగతా దేశాల్లో మాజీ సోవియెట్ దేశాలైన బల్గేరియా,హంగేరి,రొమేనియాల్లో తీవ్ర స్థాయిల్లో వాయు కాలుష్యం వెంటాడుతోంది. ఏటా దాదాపు 80లక్షల పైచిలుకు మరణాలు వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని.. ప్రతీ ఏటా ఇది రెట్టింపు అవుతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) తెలిపింది.
మలేరియా,ఎయిడ్స్ కంటే ఎక్కువ మరణాలు
వాయు కాలుష్యం ద్వారా అధిక ఆక్సీకరణ ఒత్తిడి రక్త నాళాలకు నష్టం కలిగిస్తుంది. ఇది రక్తపోటు, డయాబెటిస్, స్ట్రోక్, గుండెపోటు వంటి వాటికి దారితీస్తుంది. చైనాలో దాదాపు 20.8మిలియన్ల మంది ఏటా వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. సాధారణంగా హెచ్ఐవీ/ఎయిడ్స్,మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులతో పోలిస్తే వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాలు 19 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు జర్నల్ వెల్లడించింది. అలాగే ఆల్కాహాల్ కారణంగా సంభవిస్తున్న మరణాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
Recommended Video
పరిశోధకులు ఏమంటున్నారు..
వాయు కాలుష్యం, ధూమపానం రెండింటిని నివారించవచ్చు. అయితే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ధూమపానం కంటే వాయు కాలుష్యంపై ఆయా దేశాలు అంతగా దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా కార్డియాలజిస్టులు కూడా దీనిపై అంత శ్రద్ద పెట్టలేదు. భారతదేశం, చైనా మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ప్రజలు ఆయు ప్రమాణాన్ని తగ్గించే వాయుకాలుష్యం పట్ల అసహనం పెరుగుతోందని పరిశోధకుడు లెలీవెల్డ్ అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం ఒక ప్రధాన ఆరోగ్య ప్రమాదని గ్రహించి.. శిలాజ ఇంధనాలను దశలవారీగా తగ్గించి.. పర్యావరణానికి తక్కువ నష్టం చేసే ప్రత్నామ్నాయాల వైపు మొగ్గుచూపాలని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద ప్రపంచానికి వాయు కాలుష్యం మరో మహమ్మారిలా తయారవుతోంది. మొదట్లోనే దీనిపై దృష్టి పెట్టి నియంత్రించే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో వాయు కాలుష్యం అన్నింటికంటే పెద్ద సమస్య అయి కూర్చోవడంలో ఆశ్చర్యం లేదు.