ఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదు
సూరత్ : దైవాంశ సంభూతుడిగా అభివర్ణించుకున్న ఆశారాం బాపు ఆశ్రమంలో అరాచకాలు వెలుగుచూశాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలతో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రి బాటలోనే ఆయన తనయుడు నారాయణ్ సాయి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మహిళలను లైంగికంగా వేధించారనే కారణాలతో.. మంగళవారం సూరత్ కోర్టు ఆయనకు కూడా జీవిత ఖైదు విధించింది.
తండ్రి దారిలోనే..!
ఆశారాం బాపు అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తాజాగా ఆయన కుమారుడు నారాయణ్ సాయి కూడా రేప్ కేసులో దోషిగా తేలాడు. దీనికి సంబంధించి సూరత్ కోర్టు ఈ నెల 26 నాడు తీర్పు వెలువరించింది. అదే క్రమంలో మంగళవారం (30.04.2019) నాడు జైలుశిక్ష ఖరారు చేసింది. 2013లో అతడిపై నమోదైన అత్యాచారం కేసులో ఆరేళ్లుగా విచారణ కొనసాగి తుదితీర్పు వచ్చింది.
సూరత్కు చెందిన ఓ మహిళ నారాయణ్ సాయిపై రేప్ కేసు ఫైల్ చేశారు. 2002 నుంచి 2005 వరకు మూడు సంవత్సరాలు తాను ఆశ్రమంలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులిద్దరు అత్యాచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. 2013లో పోలీసులను ఆశ్రయించిన సదరు మహిళలు.. నారాయణ్ సాయి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హాజీపూర్ సీరియల్ కిల్లర్.. లిఫ్ట్ ఇచ్చి హత్యాచారాలు.. నిందితుడి ఇంటికి నిప్పు
ఎన్నెన్నో ఆరోపణలు..!
లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచి నారాయణ్ సాయి పరారీలో ఉన్నాడు. అయితే అప్పట్లో పోలీసులు జరిపిన దర్యాప్తులో మరో వివాదస్పద సంఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణ్ సాయికి అమ్మాయిలను సరఫరా చేసిందనే ఆరోపణలతో పోలీసులు అతని సహాయకురాలు గంగను అరెస్ట్ చేశారు. నారాయణ్ సాయి గంగతో శారీరక సంబంధం పెట్టుకోవడంతో వారికి ఓ చిన్నారి జన్మించినట్లు పోలీసులు తేల్చారు. తర్వాత కొంత కాలానికి నారాయణ్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదలావుంటే తాజాగా ఈ కేసులో గంగ, జమున, హనుమాన్ అనే వ్యక్తులను కూడా కోర్టు దోషులుగా పేర్కొంది. మోనికా అనే మహిళను నిర్ధోషిగా తేల్చింది.
ఆధ్యాత్మిక ప్రవచనాలు.. అత్యాచార ఆరోపణలు
అహ్మదాబాద్ లోని సబర్మతీ నది తీరాన యోగా, ఆధ్యాత్మికతకు మారుపేరుగాంచింది ఆశారాం బాపు ఆశ్రమం. అక్కడకు వెళ్లే భక్తులకు పురాణా, ఇతిహాసాల గురించిన ప్రవచనాలు చెప్పడంలో ఆయన దిట్ట. అయితే ఆ ఆశ్రమంలో చదువుకునే ఇద్దరు విద్యార్థులు 2008, జులై 4వ తేదీన కనిపించకుండా పోయి ఆ మరుసటి రోజే శవాలై కనిపించారు. ఆ జంట హత్యల్లో ఆశారాం బాపు హస్తమున్నట్లు కేసు నమోదైంది. తదనంతరం అత్యాచార ఆరోపణలు అతడిని జైలు జీవితానికి పరిమితం చేశాయి.
ఆశ్రమం పేరిట ఆశారాం బాపు అరాచకాలు చేశాడనే వాదనలున్నాయి. మైనర్ బాలికలను కూడా రేప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. పైగా అత్యాచారం చేయడం పాపం కాదని చెబుతుండేవాడట. చివరకు ఓ రేప్ కేసులో దోషిగా తేలడంతో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రి బాటలోనే ఇప్పుడు తనయుడు కూడా అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు పడింది.