ఉద్వాసనపై స్పందించిన కిరణ్ బేడి: అనుభవం వచ్చిందంటూ: బీజేపీ ఏజెంట్గా: టీమ్ రాజ్నివాస్
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా తనను అర్ధాంతరంగా తొలగించడం పట్ల కిరణ్ బేడి స్పందించారు. తనకు జీవితకాలం అనుభవం వచ్చిందని వ్యాఖ్యానించారు. పుదుచ్చేరికి లెప్టినెంట్ గవర్నర్గా పనిచేస్తానని తాను ఊహించలేదని, అలాంటి అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుల మేరకు కిరణ్ బేడి ఉద్వాసనకు గురయ్యారు. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఏజెంట్గా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజులుగా ఆరోపణలను చేస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఫిర్యాదు చేసింది. వాటిని ఆధారంగా చేసుకుని రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు, ఫిర్యాదులపై కిరణ్ బేడి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. లెప్టినెంట్ గవర్నర్గా పనిచేయడం తనకు జీవితకాలం అనుభవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
తన పదవీకాలంలో ఏ ఒక్కరినీ కించపరచకుండా వ్యవహరించానని అన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేశానని చెప్పారు. రాజ్భవన్కు ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చానని భావిస్తున్నానని చెప్పారు. టీమ్ రాజ్ నివాస్ తనకు అన్ని విధాలుగా సహకరించిందని, వారికి కృతజ్ఙతలను తెలియజేస్తున్నానని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను దగ్గరగా పరిశీలించడానికి లెప్టినెంట్ గవర్నర్ పదవి తనకు ఉపయోగపడిందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై సమగ్ర అవగాహన ఏర్పడిందని చెప్పారు.
కిరణ్ బేడి తొలగింపును ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. తమ మంత్రులు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కిరణ్ బేడి ద్వారా బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆయన ఆరోపణలను చేశారు. ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయడానికి కిరణ్ బేడి విశ్వ ప్రయత్నాలు చేశారంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. ఏపీలోని యానాం ఎమ్మెల్యే, మంత్రి మల్లాడి కృష్ణారావు రాజీనామా వ్యవహారం తెర మీదికి రావడానికి కూడా బీజేపీ కారణమని ధ్వజమెత్తారు.