జమ్మూకాశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేయడమే ముఖ్యం: ఈయూ ప్రకటన
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సానుకూలమైన చర్యలను భారత ప్రభుత్వం తీసుకోవాలని ఈ ప్రాంతంలో పర్యటించిన విదేశీ రాయబారుల బృందం సూచించింది. అంతేగాక, జమ్మూకాశ్మీర్లో అమలులో ఉన్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయడం చాలా ముఖ్యమని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్లో పరిస్థితులను, భద్రతా పరమైన అంశాలను పరిశీలించేందుకు విదేశీ రాయబారుల ఈయూ బృందం రెండు రోజులపాటు ఇక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం యూరోపియన్ యూనియన్(ఈయూ) విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత ప్రభుత్వం కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవసరమైన సానుకూల చర్యలను తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే, ఇంకా ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులపై విధించిన ఆంక్షలతోపాటు కొందరు రాజకీయ నాయకులు నిర్బంధంలోనే ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
అంతేగాక, భద్రతాపరమైన సమస్యలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అయితే, వీలైనంత త్వరగా ఈ ప్రాంతంలో మిగితా ఆంక్షలను కూడా ఎత్తివేయడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్(ఈయూ) సహా జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్, న్యూజిలాండ్, మెక్సికో, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాలకు చెందిన 25 మంది రాయబారుల బృందం శ్రీనగర్, జమ్మూలో పర్యటించారు.
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టు నెలలో రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్ను రెండు భాగాలుగా విభజన చేశారు. ఒకటి జమ్మూకాశ్మీర్, మరోటి లడక్. వీటిలో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. కాగా, అనాటి నుంచి శాంతిభద్రతల నేపథ్యంలో పలు ఆంక్షలను విధించింది కేంద్రం. అలాగే, మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లాంటి నేతలను గృహ నిర్భంధంలో ఉంచారు.