జగన్ అడుగు జాడల్లో: మహారాష్ట్రలో దిశ తరహా చట్టం: బిల్లుకు ఉద్ధవ్ కేబినెట్ ఆమోదం: ఏ పేరు?
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం సంచల నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీలో అధికారంలో అమలవుతోన్న దిశ తరహా చట్టాన్ని ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన బిల్లు ముసాయిదాను మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో ఈ బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టనుంది. మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, లైంగిక దాడులను నిరోధించడానికి కొత్త చట్టాన్ని తీసుకుని రాబోతోన్నట్లు వెల్లడించింది.
Recommended Video
శక్తి చట్టంగా నామకరణం..
ఈ బిల్లు ముసాయిదాకు శక్తి చట్టంగా నామకరణం చేసింది మహారాష్ట్ర మంత్రివర్గం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలో సమావేశమైన మంత్రివర్గంలో ఈ బిల్లు ఆమోదం పొందింది. `మహారాష్ట్ర శక్తి క్రిమినల్ లా (మహారాష్ట్ర అమెండ్మెంట్) బిల్లు-2020`గా పేర్కొంది. `ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ క్రిమినల్ లా (ఏపీ అమెండ్మెంట్) యాక్ట్-2019`లోని అంశాలను స్వల్ప మార్పులు చేర్పులతో కొత్త బిల్లును రూపొందించినట్లు మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు. ఇలాంటి రెండు వేర్వేరు బిల్లులను ఆమోదించినట్లు చెప్పారు.
ప్రత్యేక కోర్టులు..
చిన్నపిల్లలు, మహిళలపై లైంగికదాడులు, అత్యాచారాలకు పాల్పడిన వారిని మరణశిక్ష విధించడానికి వీలుగా ప్రత్యేక న్యాయస్థానాలు, సత్వర విచారణ చేపట్టడానికి ఉద్దేశించిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి మరో బిల్లును ఆమోదించింది మహారాష్ట్ర మంత్రివర్గం. స్పెషల్ కోర్ట్ అండ్ మెషినరీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మహారాష్ట్ర క్రిమినల్ లా-2020 అని పేరు పెట్టింది. ఈ రెండింటిని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ రెండు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు అనిల్ దేశ్ముఖ్ చెప్పారు.
చారిత్రక నిర్ణయం..
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర మంత్రివర్గం.. ఈ రెండు బిల్లులను ఆమోదించడం చారిత్రాత్మకమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ వ్యాఖ్యానించారు. మహిళలు, చిన్నపిల్లలపై దారుణాలకు పాల్పడితే.. వెంటనే మరణశిక్ష విధించేలా ఇందులోని అంశాలను పొందుపరిచామని అన్నారు. మానవ మృగాలను నియంత్రించడానికి ఇలాంటి చట్టాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దిశ చట్టంపై అధ్యయనం..
దిశ తరహా చట్టాన్ని అమలు చేయడానికి గత ఏడాది అనిల్ దేశ్ముఖ్ స్వయంగా.. ఏపీకి వచ్చిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యలయాన్ని ఆయన సందర్శించారు. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితతో భేటీ అయ్యారు. దిశ చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మహిళా పోలీస్ స్టేషన్లనూ ఆయన పరిశీలించారు. పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఓ నివేదికను అందజేశారు. ఆ అంశాలను శక్తి బిల్లులో పొందుపరిచారు.