నేను నరేంద్ర మోడీలాగే ఆలోచిస్తా..నిర్ణయాలు తీసుకుంటా: రైతులకు ఏటా రూ.2000: యడియూరప్ప
Recommended Video
బెంగళూరు: నేను మా నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలాగే ఆలోచిస్తాను..ఆయనలాగే నిర్ణయాలను తీసుకుంటాను.. అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. నరేంద్ర మోడీ అడుగు జాడల్లో నడుస్తానని చెప్పారు. రైతుల సంక్షేమానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధి వారి ఉన్నతికి కృషి చేస్తామని అన్నారు. 14 నెలల కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను సవరిస్తానని చెప్పారు.
ఏటా రెండు విడతల్లో రూ.2000
సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన పలు అంశాలపై క్లుప్తంగా మాట్లాడారు. ప్రత్యేకించి- రైతు సంక్షేమం గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నరేంద్ర మోడీ అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ పథకానికి రాష్ట్రంలో అదనపు నిధులను సమకూరుస్తామని చెప్పారు. కేంద్రం అమలు చేస్తోన్న విధానం తరహాలోనే రాష్ట్రంలో రైతుల కోసం సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. రైతులకు ఏటా రెండు విడతల్లో 2000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, యడియూరప్ప చెప్పారు.
ప్రతీకార రాజకీయాలు చేయం
కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం తరహాలోనే ప్రతీకార రాజకీయాల జోలికి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. పట్టు విడుపులను తాము ప్రదర్శిస్తామని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం తమ, తమ పార్టీకి ఉందని చెప్పారు. ప్రతీకార రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో దిగబోమని తాను సభకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు యడియూరప్ప. బడుగు, బలహీన, పేద ప్రజల అభ్యున్నతి కోసం కలిసి రావాలని ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో పయనింపజేయడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు.