Nirbhaya case: దోషులకు అదే చివరి రోజు కావాలి, ఛాన్సుంటే వారి చావును చూస్తా: నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన నలుగురు దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు తేదీ(మార్చి 20)ని ఢిల్లీ పాటియాలా కోర్టు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష అమలుపై ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిర్భయ తల్లి స్పందించారు.
Recommended Video
ఆ రోజు కొత్త ఉదయం..
మార్చి 20 ఉదయం తమ జీవితాలకు మరో కొత్త ఉదయం అవుతుందంటూ నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించారు. ఈసారైనా ఖచ్చితంగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తారనే భావిస్తున్నట్లు తెలిపారు. 2012లో జరిగిన ఘటనలో కోర్టు పలుమార్లు విచారణ జరిపి నలుగురు నిందితులకు మరణశిక్షను ఖరారు చేసిందని... అయితే, నిందితులు ఈ తీర్పుపై పిటిషన్లు వేస్తూ ఉరిశిక్షను తప్పించుకుంటున్నారన్ని చెప్పారు.
వారి చావును చూడాలని వుంది..
దోషులుకు వేసే శిక్ష ద్వారా మరొకరు ఇలాంటి దారుణానికి పాల్పడాలంటే భయపడేలా ఉండాలని నిర్భయ చివరి కోరికగా ఆశాదేవి తెలిపారు. మార్చి 20వ తేదీనే నిర్భయ దోషులకు చివరి రోజు అవుతుందని ఆశిస్తున్నట్లు నిర్భయ తల్లి చెప్పారు. అవకాశం ఉంటే.. దోషులను మరణిశిక్ష విధించే సమయంలో తాను కూడా అక్కడ ఉంటానని అన్నారు. దోషులు చనిపోతుండగా.. తాను చూస్తానని అన్నారు.
మార్చి 20న దోషులకు ఉరి తప్పదు..
కాగా, మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు నిర్భయ దోషులను ఉరితీయాలంటూ గురువారం ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉరిశిక్ష అమలుకు మూడుసార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దోషులు న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటూ శిక్షను వాయిదాపడేలా చేశారు. ఇప్పుడు న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకోవడంతో ఉరి ఖాయమైనట్లేనని తెలుస్తోంది.