కర్ణాటకలో లింగాయుతులకు అగ్రస్థానం: సీఎం, 7 మంత్రి పదవులు, ఒక్క కులానికి 44 శాతం!
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గంలో కులాల వారిగా మంత్రి పదవులు కట్టబెట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మంత్రివర్గంలో లింగాయత్ కులానికి పెద్దపీట వేసి 8 మంత్రి పదవులు ఇచ్చారు. ఒక్కలిగ (గౌడ)కు మూడు మంత్రి పదవులు కేటాయించారు. కులాల లెక్కలు, అనుభవంతో పాటు జిల్లాల వారిగా పరిగణలోకి తీసుకుని మంత్రి పదవులు కేటాయించారు. మిగిలిన కులాల వారికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. అయితే కరావళి, పాత మైసూరు జిల్లాల వారికి మొండి చెయ్యి మిగిలింది.
17 మందికి మంత్రి పదవులు
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మంత్రివర్గంలో 17 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో అవకాశం దక్కిని ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఎస్. యడియూరప్పకు తెలీకుండా ఢిల్లీలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మంత్రివర్గం చివరి జాబితా తయారు చేసి చివరి నిమిషంలో సీఎం యడియూరప్పకు పంపించారు.
లింగాయుతులకు 44 శాతం
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప లింగాయత్ వర్గానికి చెందిన వారే. యడియూరప్పతో పాటు మంత్రి వర్గంలో మరో 7 మందికి మంత్రులుగా స్థానం కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, లక్ష్మణ సవది, వి. సోమణ్ణ, బసవరాజ్ బోమ్మయ్, సీసీ పాటిల్, శశికళ జోల్లే, జేసీ, మధుస్వామికి మంత్రి పదవులు దక్కాయి. హైదరాబాద్ కర్ణాటకు చెందిన లింగాయుత్ ఎమ్మెల్యేలకు ఒక్క మంత్రి పదవి దక్కలేదు. యడియూరప్ప మంత్రివర్గంలో 44 శాతం లింగాయుత్ వర్గానికి మంత్రి పదవులు దక్కాయి.
గౌడ వర్గానికి పెద్దపీట
యడియూరప్ప మంత్రివర్గంలో లింగాయుతుల తరువాత ఒక్కలిగ (గౌడ) కులానికి ఎక్కువ ప్రధాన్యత ఇచ్చారు. బెంగళూరు నగరంలోని పద్మనాభనగర ఎమ్మెల్యే ఆర్. అశోక్, మల్లేశ్వరం ఎమ్మెల్యే డాక్టర్ ఆశ్వథ్ నారాయణ, చిక్కమగళూరు ఎమ్మెల్యే సీటీ. రవికి యడియూరప్ప మంత్రి వర్గంలో మంత్రి పదవులు దక్కాయి.
అన్ని కులాలకు అవకాశం
యడియూరప్ప మంత్రి వర్గంలో దళితులకు రెండు మంత్రి పదవులు దక్కాయి. మధోళ ఎమ్మెల్యే గోవింద కారజోళ, ముళబాగిల్ ఎమ్మెల్యే (స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే) నాగేష్, కురుబ కులానికి చెందిన కేఎస్. ఈశ్వరప్ప, వాల్మీకి వర్గానికి చెందిన బళ్లారి శ్రీరాములు, బెంగళూరులోని రాజాజీనగర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ (బ్రాహ్మాణ), బిల్లద కులానికి చెందిన కోటా శ్రీనివాస పూజారి, లంబాణి వర్గానికి చెందిన ప్రభు చౌహాన్ లకు మంత్రి పదవులు దక్కాయి.
కరావళికి మొండి చెయ్యి
కర్ణాటకలోని కరావళి జిల్లాల్లో (సముద్ర తీర జిల్లాలు)లో బీజేపీకి ఎక్కువగా ఎమ్మెల్యేల సీట్లు వచ్చాయి. కరావళి ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఒక్క మంత్రి పదవి దక్కలేదు. అయితే విధాన పరిషత్ సభ్యుడు (ఎమ్మెల్సీ) కోటా శ్రీనివాస పూజారికి మాత్రం మంత్రి పదవి దక్కింది. శిరశి శాసన సభ్యుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరికి స్పీకర్ పదవి దక్కింది. ఉడిపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లోని ఏ ఒక్క ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కలేదు. పాత మైసూరు ప్రాంతంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఏ ఒక్క ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కలేదు.