ఇలా అయితే రాజీనామా చేస్తా: యడియూరప్పకు కోపం వచ్చింది
కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది ముగియకుండానే అప్పుడే రాజీనామా చేస్తానని చెబుతున్నారు. అయితే ఎందుకు ఆయన రాజీనామా చేస్తానని చెబుతున్నారు..? దీని వెరనక అసలు కథ ఏంటి..?
మురుగేష్ను కేబినెట్లోకి తీసుకోవాలంటూ ఒత్తిడి
కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నారు. ఇందుకు కారణం లింగాయత్ సామాజికవర్గానికి చెందిన స్వామీజీగా తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే మురుగేష్ నిరానీ కేబినెట్లోకి తీసుకోవాలని లేదంటే లింగాయత్ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని స్వామీజీ చెప్పారు. హరిహర్లో జరిగిన లింగాయత్ సామాజిక వర్గపు సమావేశంలో సీఎం యడియూరప్ప పాల్గొన్నారు. ఈ సభలో వేల మంది లింగాయత్లను ఉద్దేశించి స్వామి వచానంద్ ప్రసంగించారు. ఆ సమయంలో మురుగేష్ నిరానీ కష్టకాలంలో సీఎం యడియూరప్ప వెంట నిలిచారని ఆయన్ను కేబినెట్లోకి తీసుకోకపోతే లింగాయత్ల మద్దతు తనకు ఇకపై ఉండబోదని చెప్పారు.
ఇలా అయితే రాజీనామా చేస్తా
స్వామీజీ ఈ మాట చెప్పగానే వెంటనే లేచిన యడియూరప్ప ఇలా అయితే తాను ఏమీ చేయలేనని రాజీనామా చేస్తానని చెప్పారు. తనను బెదిరించండం సరికాదని వెల్లడించారు. అయితే తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని స్వామీజీ అన్నారు. ఇదే సమయంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేత హోంమంత్రి బస్వరాజ్ బొమ్మాయ్ కూడా సీఎం యడియూరప్పకు చెప్పే ప్రయత్నం చేశారు. 17 మంది ఎమ్మెల్యేలు వారిలో కొందరు మంత్రులు కూడా తమ పదవులను త్యాగం చేసి వనవాసంలో ఉన్నారని చెప్పారు యడియూరప్ప. తనకు సహకరించి మూడేళ్ల పదవీకాలం విజయవంతం అయ్యేలా చూడాలని లేదంటే తాను రాజీనామా చేసేందుకు సిద్దమని చెప్పిన యడియూరప్ప... అధికారం తనకు కొత్త కాదని చెప్పారు.
11 మంది రెబెల్స్కు మంత్రిపదవి ఇస్తానంటూ హామీ
ప్రస్తుతం కర్నాటకలో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ అంటే 117 సీట్లు ఉన్నాయి. కర్నాటకకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెల్చుకుంది. ఇక కేబినెట్ విస్తరణ చేయాల్సిందిగా యడియూరప్పపై ఒత్తిడి వస్తోంది. అయితే ఇందుకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ జేడీయూల నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న 11 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తానని యడియూరప్ప ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే యడియూరప్ప తమకు తండ్రిలాంటి వాడని మురుగేష్ చెప్పారు. యడియూరప్ప ఏది చెప్పిన తమ మంచికోసమే అని చెప్పిన మురుగేష్ బీజేపీ సర్కార్ మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంటుందని చెప్పారు. మరోవైపు జనవరి 18 బీజేపీ జాతీయాధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగళూరుకు వస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో కేబినెట్ విస్తరణపై చర్చిస్తామని యడియూరప్ప చెప్పారు.