లింగాయుతకు ప్రత్యేక మతం, మైనారిటీ హొదా కొంప ముంచింది, చేతులు కాల్చుకోలేం, చెక్!
బెంగళూరు: కర్ణాటకలో లింగాయుత వర్గానికి ప్రత్యేక మతం, మైనారిటీ హోదా ఇప్పించడానికి తీవ్రస్థాయిలో పోరాటం చేసిన ఆ వర్గం నాయకుడు, మాజీ మంత్రి ఎంబి. పాటిల్ మీద కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉందని సమాచారం. లింగాయుతకు ప్రత్యేక మతం, హోదా ఇవ్వడం వలనే కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాలేకపోయిందని, మళ్లీ ఎంబి. పాటిల్ కు మంత్రి పదవి ఇచ్చి చేతులు కాల్చుకోలేమని హైకమాండ్ అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిసింది.
మంత్రుల పోరాటం
లింగాయుతకు ప్రత్యేక మతం, మైనారిటీ హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పోరాటం చేశారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఎంబి. పాటిల్ తో పాటు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు లింగాయుతకు ప్రత్యేక మతం, మైనారిటీ హోదా వచ్చే విధంగా పావులుకదిపారు.
చిత్తుగా ఓడించారు
లింగాయుతకు ప్రత్యేక మతం, మైనారిటీ హోదా రావడానికి కారణం అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులను శాసన సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. లింగాయుత, వీరశైవులను వేరు చెయ్యడానికి ప్రయత్నించారని ఓటర్లు కాంగ్రెస్ పార్టీ మీద ప్రతీకారం తీర్చుకున్నారు. అయితే ఎంబి. పాటిల్ మాత్రం బబలేశ్వర నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు.
మంత్రి పదవి కట్
సిద్దరామయ్య ప్రభుత్వంలో ఎంబి. పాటిల్ మంత్రిగా పని చేశారు. ఈసారి మంత్రి పదవి వస్తుందని ఎంబి. పాటిల్ ధీమాతో ఉన్నారు. అయితే లింగాయుత, వీరశైవ ఓట్లు చీలిపోవడానికి ఎంబి. పాటిల్ ప్రధాన కారణం అయ్యారని కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ఈసారి మంత్రి పదవి ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.
అదే వర్గానికి పదవి
ఎంబి. పాటిల్ మంత్రి పదవికి చెక్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయన వర్గానికి చెందిన రాజశేఖర్ పాటిల్ కు మంత్రి పదవి ఇచ్చింది. రాజశేఖర్ పాటిల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత సిద్దరామయ్య ప్రభుత్వంలోనే ఆయన మంత్రి పదవి ఆశించారు.
కాంగ్రెస్ కు నష్టం
రాజశేఖర్ పాటిల్ కు ఇప్పుడు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే అసమ్మతి పెరిగిపోతుందని ఎంబి. పాటిల్ ను పక్కన పెట్టి ఆయనకు అవకాశం ఇచ్చారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ఎంబి. పాటిల్ వలన లింగాయుత ఓటు బ్యాంకుతో నష్టం వచ్చిందని, ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇచ్చి మరోసారి చేతులు కాల్చుకోలేమని హైకమాండ్ ఆయన్ను పదవికి దూరం పెట్టిందని తెలిసింది.