లింగాయత్లు హిందువులే: కర్ణాటక హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
బెంగళూరు: లింగాయత్లు హిందుత్వంలో భాగమేనని కేంద్ర ప్రభుత్వం మంగళవారం కర్ణాటక హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి సిద్ధరామయ్య ప్రభుత్వం లింగాయత్లకు ప్రత్యేక మతం హోదాను ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్రం నిర్ణయం అందరూ ఊహించిందే అయినా, ఆసక్తిని కలిగించింది.
ఇప్పుడు హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. లింగాయత్లకు ప్రత్యేక మతం హోదా డిమాండును పరిశీలించాలని కర్ణాటక స్టేట్ మైనార్టీ కమిషన్ ఓ ప్యానెల్ను నియమించింది. దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో పలువురు పిటిషన్లు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
లింగాయత్/వీరశైవ లింగాయత్లను హిందువులుగానే పేర్కొంటూ 2011లో జనగణన చేశారని కేంద్రం తమ అఫిడవిట్లో పొందుపర్చింది. అంతేకాకుండా నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ యాక్ట్ 1992 ప్రకారం ఒక కమ్యూనిటీని ఓ మతంగా ప్రకటించేందుకు ఎలాండటి నిర్దేశిత ప్రమాణాలు లేవని పేర్కొంది.
లింగాయత్లు, వీరశైవ లింగాయత్లు హిందుత్వంలో భాగమేనని, అది ప్రత్యేక మతం ఏమాత్రం కాదని కేంద్రం తమ అఫిడవిట్లో పేర్కొంది. లింగాయత్ల సామాజిక, చారిత్రక అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.