ఏడాదిలోగా మొబైల్ నంబర్, ఆధార్ అనుసంధానం: కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏడాదిలోగా అన్ని మొబైల్ నంబర్లను ఆధార్ కు అనుసంధానం చేయాల్సిందిగా సోమవారం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
న్యూఢిల్లీ: సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వానికి ఒక కీలక సూచన చేసింది. ఏడాదిలోగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న, భవిష్యత్తులో వినియోగంలోకి రాబోయే అన్ని మొబైల్ నంబర్లను ఆధార్ కు అనుసంధానం చేయాల్సిందిగా సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సిమ్ కార్డు వినియోగించే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరించాలని, భారత్ లో 100 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారని, వారందరికి ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి చేయాలని ఆదేశించింది.
కేవలం పోస్ట్ పెయిడ్ మాత్రమే కాక, ప్రీ పెయిడ్ వినియోగదారులందరికి కూడా ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని, ఇక నుంచి ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు సంబంధించిన దరఖాస్తును కూడా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది.
ఇందుకు తగిన విధానాలను సిద్ధం చేయాలని కేంద్రానికి సూచించింది. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో బ్యాంకింగ్ కు మొబైల్ ఫోన్లే ఆధారం కానుండడంతో ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.