ఆధార్-పాన్ అనుసంధానం గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్)ను ఆధార్తో అనుసంధానం చేసుకునేందుకు గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) జూన్ 30 వరకు పొడిగించింది. మార్చి 31తో ముగియాల్సిన ఈ గడువును పెంచుతూ మంగళవారం ఒక ప్రకటన జారీచేసింది.
ఆధార్తో పాన్ లింకేజీకి చివరి తేదీని పొడిగించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మొబైల్, బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసుకోవడానికి గడువును సుప్రీంకోర్టు ఇటీవలే నిరవధికంగా పొడిగించిన నేపథ్యంలోనే సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలావుంటే, సంక్షేమ పథకాలను ఆధార్తో అనుసంధానించుకోవడానికి గడువును పొడిగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆ గడువు మార్చి 31తో ముగియనుంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరించింది.
పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి పటిష్ట చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రైవేట్ సంస్థలు ఆధార్ సమాచారాన్ని బహిర్గతం చేయకుండా తీసుకుంటున్న చర్యలేంటని ఆధార్ ప్రాధికార సంస్థను ప్రశ్నించింది. యూఐడీఏఐ కేంద్రీయ డేటా నిల్వ కేంద్రం నుంచి సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాల్లేవని ఆ సంస్థ స్పష్టం చేసింది.