ఆధార్తో ఓటరు ఐడీ అనుసంధానం కానుందా..?
ఢిల్లీ: ఆధార్ సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానిస్తే ఎన్నికల సమయంలో మోసాలు జరిగే అవకాశం లేదని, రిగ్గింగ్కు పాల్పడే ఛాన్స్ ఉండదని.. దొంగ ఓట్లు కూడా వేసే అవకాశం ఉండదని ఎన్నికల సంఘంకు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి విక్రమంజీత్ సేన్ చెప్పారు. ఆధార్కు సంబంధించి 12 అంకెలు గల బయోమెట్రిక్ నెంబరు ఓటర్ ఐడీతో అనుసందానం చేయడంపై జస్టిస్ విక్రమ్జీత్ సేన్ సలహాను ఎన్నికల సంఘం కోరింది.
ఆధార్తో ఓటర్ ఐడీ అనుసంధానం
ఒకరికి ఒకే ఓటు ఉంటుంది కనుక ఆ ఓటరు నెంబర్ను ఆధార్ నెంబర్తో అనుసంధానం చేస్తే ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేసే పరిస్థితి ఉండదని జస్టిస్ విక్రమ్జీత్ సేన్ అన్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండటంతో పాటు సులభతరంగా కూడా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటింగ్ వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తుండటంతో జస్టిస్ విక్రమ్ జీత్ సేన్ అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో ఆయన తన సలహాలను సూచనలను ఇచ్చారు.
రాజధాని ప్రస్తావన ఏదీ: గవర్నర్ ప్రసంగంలో లేని అమరావతి: జగన్ ఆలోచన మారుతోందా..!
సుప్రీం కోర్టు ఆధార్ పై ఏం చెప్పింది..?
ఆధార్ కార్డు అన్ని చోట్ల అవసరం లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అదే ఆధార్ సంఖ్యకు ఓటర్ ఐడీని అనుసంధానం చేద్దామన్న ఎన్నికల సంఘం ఆలోచన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆధార్ కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, పాన్కార్డులు, ఇన్కంటాక్స్ ఫైలింగ్లకు మాత్రమే తప్పనిసరి చేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2015లో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్న ఆలోచనతో ఆధార్ సంఖ్యతో ఓటరు ఐడీ సంఖ్యను అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఆధార్ కార్డు అన్ని చోట్ల తప్పనిసరి చేయడం సరికాదనే పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు అవడంతో ఈ ఆలోచనను ఎన్నికల సంఘం విరమించుకుంది. అప్పటికే ఎన్నికల సంఘం దేశంలోని 380 మిలియన్ మంది ఓటర్ ఐడీలను వారి ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయడం పూర్తి చేసింది.
ఆధార్ సంఖ్య వద్దనుకునే వారి పరిస్థితి ఏంటి..?
ఇక ఎవరికైతే ఆధార్ కార్డుతో తమ వ్యక్తిగత విషయాలకు భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించి ఆధార్ కార్డు తీసుకోరో అలాంటి వారు ఓటు వేయకూడదని వారి దగ్గరున్న ఓటరు ఐడీని రద్దు చేసుకోవాలని జస్టిస్ సేన్ అభిప్రాయపడ్డారు. ఓటు వేయడం కావాలా లేక వ్యక్తిగత విషయాల్లో గోప్యత కావాలా అన్నది నిర్ణయించుకుని ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ సేన్ సూచించారు. ఇలాంటి కష్టం కొద్దిరోజులు ఉంటాయని... అయినప్పటికీ తప్పదని ఆయన అన్నారు. ఓటరు ఐడీని ఆధార్తో అనుసంధానం చేయడంతోనే ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం జరుగుతుందని జస్టిస్ సేన్ తెలిపారు. అదేసమయంలో ఎవరికైనా ఆధార్ కార్డు అందకపోతే అలాంటి వారిని ఓటు వేయకుండా ఆపరాదని పేర్కొన్నారు. ఇదిలా జరగాలంటే 1952 ప్రజాప్రతినిధుల చట్టంను సవరించాల్సి ఉంటుందని అయితే అందులో ఎలాంటి అంశాలను చేర్చాల్సి వస్తుందో అనేదానిపై తానేమీ వ్యాఖ్యానించబోనని జస్టిస్ సేన్ తెలిపారు.