సోషల్ మీడియాతో ఆధార్ లింక్ చేస్తారా? ఐతే మీ ప్లాన్ ఏంటీ?: కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ను అనుసంధానం చేసే ఆలోచన ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నకిలీ, తప్పుడు వార్తల వ్యాప్తిని నిరోధించేందుకు ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుం ఉన్న ఖాతాదారులకు వారి ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసేలా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవేమిటో తమకు చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది.
సెప్టెంబర్ 24లోగా తమకు దీనిపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫేస్బుక్కు సంబంధించి ఓ అభ్యర్థనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించింది. వివిధ హైకోర్టులో తమ సంస్థపై ఉన్న పిటీషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న ఫేస్బుక్ అభ్యర్థనను జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
మద్రాసు హైకోర్టులో రెండు పిటిషన్లు, బాంబే హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో తమపై ఒక్కో పిటిషన్ చొప్పున పెండింగ్ ఉందని ఫేస్బుక్ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
కాగా, ఫేస్బుక్పై హైకోర్టుల పరిధిలో ఉన్న పిటీషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.