సీఎం పళనిసామి మీటింగ్, బ్రాందీ, బిరియాని, రూ. 500 ఇస్తారు : దీపా గ్యాంగ్ బాంబు!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి రాష్ట్ర వ్యాప్తంగా సంచరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే (అమ్మ) పార్టీనే ఆదరించాలని పళనిసామి ప్రచారం ముమ్మరం చేశారు.
ఈ సందర్బంలో జయలలిత మేనకోడలు దీపా అనుచరులు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, శశికళ వర్గంలోని నాయకులను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్న నాయకులు వారు నిర్వహిస్తున్న బహిరంగ సభలకు కార్యకర్తలు రారని తెలుసుకుని అనేక ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు.
మధురైలో
తమిళనాడు ముఖ్యమంత్రి మధురైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ సక్సస్ కావడానికి ఆయన వర్గంలోని నాయకులు శక్తి వంచనలేకుండా పని చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలను తరలించారు.
బ్రాందీ, బిరియానీ, రూ. 500
జయలలిత మేనకోడలకు చెందిన ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై అధికార ప్రతినిధి పాసుంపాన్ పాండియన్ మీడియాతో మాట్లాడుతూ సీఎం పళనిసామి బహిరంగ సభకు వస్తే బ్రాందీ, బిరియాని, రూ. 500 ఇస్తామని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
మద్దతు లేకనే ఇలా
ప్రజల మద్దతుతో బహిరంగ సభలు నిర్వహించాలని, ఇలా అడ్డదారిలో కాదని పాససుంపాన్ పాండియన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నామని అడ్డుఅదుపులేకుండా అడ్డదారిలో డబ్బు సంపాదించి ఇలా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి
మధురైలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు స్వచ్చందంగా తరలివస్తున్నారని, వారిని ఎవ్వరూ తరలించడం లేదని, మద్యం, బిరియాని, డబ్బులు పంచడం లేదని ఎడప్పాడి పళనిసామి వర్గీయులు అంటున్నారు.
పన్నీర్ సెల్వం మీద నోకామెంట్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం శుక్రవారం నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే దీపా మద్దతుదారులు శశికళ వర్గాన్ని టార్గెట్ చేసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద విమర్శలు చేస్తున్నారు. పన్నీర్ సెల్వం గురించి వారు మాట్లడటం లేదు.