మద్యం అమ్మకాలు కూడా ఓ కారణమే: దిశా ఘటనపై లోక్సభలో ఉత్తమ్
న్యూఢిల్లీ: శంషాబాదులో మహిళా వెటినరీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య ఘటనను లోక్సభ ముక్తకంఠంతో ఖండించింది. 2012లో నిర్భయ ఘటన తర్వాత అత్యంత పెద్ద ఘటన ఇదే అని సభ్యులు సభలో తెలిపారు. ఇక ఘటనపై లోక్సభలో మాట్లాడారు నల్గొండ ఎంపీ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సర్కార్పై నిప్పులు చెరిగారు. అదే సమయంలో మరో తెలుగు ఎంపీ బండి సంజయ్ ఘటనను ఖండిస్తూ చట్టాలను కఠినతరం చేయాల్సి ఉందని చెప్పారు.
దిశా తల్లిదండ్రులను పోలీసులు అవమానించారు
దిశాపై జరిగిన అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దిశా తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించలేదని పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడు చాలా నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారని సభ దృష్టికి తీసుకొచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఆ తల్లిదండ్రులు ఆ తర్వాత మరో నాలుగు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు.
తెలంగాణ హోంమంత్రి వ్యాఖ్యలు బాధాకరం
తొలిసారిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదు స్వీకరించి వెంటనే వెతికి ఉంటే ఈ రోజు దిశా ప్రాణాలతో ఉండేదని చెప్పారు. అంతేకాదు తమ కుమార్తె ఎవరితోనైనా వెళ్లిపోయిందా అంటూ వ్యాఖ్యలు చేసి దిశా తల్లిదండ్రులను పోలీసులు అవమానించారని మండిపడ్డారు. కూత వేటు దూరంలో హైదరాబాదు ఉందని అక్కడ పోలీసులు పాట్రోలింగ్ చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక తెలంగాణ హోంశాఖ మంత్రి బాధ్యతారాహిత్యంతో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలు ఇటు తల్లిదండ్రులతో పాటు చాలామందిని కలచివేశాయని చెప్పారు. కుటుంబ సభ్యులకు కాకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉంటే బాగుండేదని హోంమంత్రి మహమ్మూద్ అలీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
హైవేలపై మద్యం అమ్మకాలు కూడా కారణం
దిశపై అత్యాచారం, హత్యకు మద్యం కూడా ఓ కారణమే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నేషనల్ హైవే, రాష్ట్ర హైవేలపై మద్యం అమ్మరాదని సుప్రీంకోర్టు 2016లో ఆదేశాలు ఇచ్చిందని ఆ ఆదేశాలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. హైవేలపై విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే అందుకు కారణం కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న విధానాలే అని చెప్పారు.
చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసం ఉంది
దిశపై అత్యాచారం ఆపై హత్య యావత్ దేశాన్ని కదిలించిందని అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇదని బండి సంజయ్ అన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పిన బండి సంజయ్... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు శిక్ష వెంటనే పడేలా చర్యలు తీసుకోవాలని, శిక్ష అమలు చేయడంలో జాప్యం చేయరాదని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే ప్రజల్లో చర్చ జరగాలని.. ఆమేరకు ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పారు.
అవగాహన కల్పిస్తే సరిపోదని వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. ఇలాంటి ఒక ఘటన జరిగినప్పుడే స్పందిస్తున్నామని అసలు అత్యాచారం చేసిన వారిని వెంటనే శిక్షించేలా చట్టంలో మార్పులు ఎందుకు చేయకూడదని ఆయన ప్రశ్నించారు.