నేను ఎమ్మెల్యే అయితే మటన్, మద్యం, ప్రతిరోజు ఫుడ్, కాఫీలు, స్కూల్ ఫీజులు ఫ్రీ, వరైటీ!
బెంగళూరు: రాజకీయం అంటే చదరంగం లాంటిది. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తుంటున్నారు. ప్రజలను ఆకర్షించడానికి అనేక ఉచిత హామీలు ఇస్తుంటారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రజలకు ముఖం చూపించడాని సైతం వెనకడుగు వేసే నాయకులు ఎందరినో మనం చూశాం.
రాజకీయాల గురించి కొంచెం తెలిసిన వారు సైతం రాజకీయ నాయకులు ఎలాంటి హామీలు ఇస్తారో తెలిసే ఉంటుంది. అయితే కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ వ్యక్తి తాను ఎమ్మెల్యే అయితే మటన్, మద్యం, ప్రతిరోజు ఫుడ్, కాఫీలు, స్కూల్ ఫీజులు ఉచితంగా ఇస్తానని వరైటీ వరైటీ హామీలు ఇచ్చి హాట్ టాఫిక్ గా మారిపోయాడు.
నాయకుల హామీలు
శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు ప్రజలకు అనేక ఉచిత హామీలు ఇస్తుంటారు. మీ రుణాలు మాఫీ చేస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, రోడ్లు వేసి ఉచిత విద్యుత్ అందించి వీది దీపాలు వేయిస్తామని, తాగు నీరు సరఫరా చేస్తామని తదితర ప్రజలకు అవసరం అయ్యే హామీలు ఇచ్చే రాజకీయ నాయకులను మనం చూస్తున్నాం.
ఆంధ్రా సరిహద్దు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లికి 50 కిలో మీట దూరంలో బెంగళూరు రహదారిలో చింతామణి అనే పట్టణం ఉంది. చింతామణి శాసన సభ నియోజక వర్గం నుంచి వైఎన్. సురేష్ అనే వ్యక్తి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. వైఎన్. సురేష్ ఇచ్చిన విచిత్రహామీలు ఇప్పుడు చింతామణి నియోజక వర్గంతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ అయ్యింది.
మందు, మటన్, ఫుడ్ ఫ్రీ
నేను ఎమ్మెల్యే అయితే 18 ఏళ్ల దాటిన యువకులకు వారంలో ఒక సారి మద్యం ఫ్రీగా ఇస్తానని వైఎన్. సురేష్ ప్రకటించాడు. వారంలో రెండు సార్లు మటన్, 300 గ్రాముల చికెన్, మూడు పూటల బోజనం, రోజుకు రెండు సార్లు టీ, కాఫీ ఫ్రీగా ఇస్తానని వైఎన్. సురేష్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో సంచలన ప్రకటన చేశాడు.
ఆడపడుచులకు వరాలు
నేను ఎమ్మెల్యే అయితే ఆడపడుచులకు ధనియాల పొడి, కారం పొడి, ఊరగాయ ఉచితంగా ఇస్తానని వైఎన్. సురేష్ ప్రకటించాడు. తనను గెలిపిస్తే ఉచిత రవాణ, వైద్య చికిత్స, పిల్లల స్కూల్ ఫీజులు, మొబైల్ రీచార్జ్, ఇంటర్మెట్ డేటా, మధ్య తరగతివారి పెళ్లికి ఉచితంగా బంగారు తాళిబొట్టు, కొత్త బట్టలు తదితరాలు ఉచితంగా అన్నీ ఇస్తానని వైఎన్. సురేష్ మేనిఫెస్టోలో ప్రకటించాడు.
షరతులు వర్థిస్తాయి
వైఎన్. సురేష్ ఇచ్చిన హామీల గురించి తెలుసుకున్న వన్ ఇండియా ప్రతినిధి ఆయన్ను సంప్రధించారు. అన్ని ఉచితంగా ఇస్తే సోంబేరీలు అయిపోతారు కదా అంటే అలా ఏం లేదు, తాను ప్రకటించిన ఉచిత వరాలు పొందాలంటే వారు కచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం లేదా పని చేస్తూ ఉండాలని షరతులు చెప్పాడు. ఏదో ఒక పని చేసే వారికి మాత్రమే తాను ఇచ్చిన ఉచిత హామీలు పొందడానికి అవకాశం ఉంటుందని, ఉద్యోగం చేసి డబ్బు సంపాధించి ఈ ఉచిత పథకాలు పొందాలని వైఎన్ సురేష్ చెప్పారు.
దేశంలో అవినీతి
దేశంలో అవినీతి పెరిగిపోయిందని, ఇవన్నీ ఉచితంగా ఇస్తే అవినీతి కొంచమైనా అరికట్టడానికి అవకాశం ఉంటుందని వైఎన్. సురేష్ అన్నారు. వృద్దులకు తామే ఉద్యోగాలు కల్పిస్తామని, వారికి ఉచితంగా తాను ఇస్తానని చెప్పినవి మొత్తం అందిస్తామని వైఎన్. సురేష్ అన్నారు.
లిమిట్ లిక్కర్
యువతకు ఉచితంగా మద్యం (లిక్కర్) ఇస్తామని చెప్పి వారిని తాగుబోతులను చేస్తున్నారా అని ప్రశ్నించగా తాను రోజు ఇస్తానని చెప్పలేదని, వారంలో ఒక్క రోజు మద్యం ఉచితంగా ఇస్తానని చెప్పానని వైఎన్. సురేష్ అన్నారు. మద్యం దుకాలు పూర్తిగా మూసి వేసి వాటిని తానే స్వాధీనం చేసుకుని వారంలో ఒక్క రోజు ఉచితంగా ఇస్తానని, ఇష్టం అయిన వాళ్లు తాగవచ్చు లేదా వదిలేయవచ్చని వైఎన్. సురేష్ అన్నారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎన్. సురేష్ ఇచ్చిన ఉచిత హామీలపై చింతామణి నియోజక వర్గంతో పాటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.