చదువుకున్న వ్యక్తి అనుకున్నా కానీ...సత్యనాదెళ్లకు బీజేపీ ఎంపీ కౌంటర్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం భారత్కు ప్రమాదకరం అని వ్యాఖ్యానించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కామెంట్స్పై కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి. ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవికాదన్నారు.
సత్యనాదెళ్ల లాంటి వ్యక్తులను చూస్తే చదువుకున్న వారైనప్పటికీ వారు ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉందంటూ మీనాక్షి లేఖి ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్లలో మైనార్టీలుగా ఉన్న ఇతర మతస్తులు శరణార్థులుగా భారత్కు వచ్చారని చెప్పిన మీనాక్షి లేఖి వారికి భారత పౌరసత్వం ఇవ్వడంలో తప్పేముందని అన్నారు.
ఇరాక్ సిరియా దేశాల్లో మైనార్టీలుగా ఉన్న యెజిదీలు ప్రాణభయంతో అమెరికాకు పారిపోయారన్న విషయాన్ని గుర్తుచేసిన మీనాక్షి లేఖి సిరియాలో నివసించే ముస్లింలకు అవకాశం ఇద్దామా అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను సీఏఏపై ప్రశ్నించగా ఆయన దీన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చిన ఒక వలసదారుడు ఇన్ఫోసిస్ సీఈఓ స్థాయికి ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం దేశానికి మంచిది కాదన్నారు.
How literate need to be educated ! Perfect example. Precise reason for CAA is to grant opportunities to persecuted minorities from Bangladesh, Pakistan & Afghanistan.
— Meenakashi Lekhi (@M_Lekhi) January 14, 2020
How about granting these opportunities to Syrian Muslims instead of Yezidis in USA ? pic.twitter.com/eTm0EQ1O25
ప్రతి దేశానికి కొన్ని సరిహద్దులు పరిధులు ఉంటాయన్నారు సత్యనాదెళ్ల. ఆ దేశ అంతర్గత భద్రతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదేశం పై ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే ఇమ్మిగ్రేషన్ విధానాలను రూపొందించాల్సి ఉంటుందని సత్యనాదెళ్ల అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు ఈ పరిధిలోనే చర్చిస్తాయని సత్యనాదెళ్ల అన్నారు. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాను భారత్లో పుట్టానని చెప్పిన సత్యనాదెళ్ల అక్కడ విభిన్న సంస్కృతుల మధ్య పెరిగినట్లు వెల్లడించారు. అదే సమయంలో అమెరికాకు వలస వచ్చి స్థిరపడినట్లు చెప్పిన నాదెళ్ల... ఇక్కడ తనకు ఎంతో గౌరవం దక్కిందని వివరించారు. ఒక భారతీయుడిగా విదేశాల్లో అత్యంత ఉన్నతమైన పదవిని చేపట్టి భారత సమాజానికి ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తున్నట్లు చెప్పిన నాదెళ్ల... సీఏఏ తీసుకురావడంతో నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు.