కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవం: సెంటరాఫ్ అట్రాక్షన్గా ‘బుల్లి మఫ్లర్మ్యాన్’,సెల్పీల కోసం MLAలూ..
న్యూఢిల్లీ: ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులుగా కూడా ప్రమాణం చేశారు. కాగా, ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవంలో ఓ బుల్లి 'మఫ్లర్ మ్యాన్' సందడి చేశారు.
మూడోసారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం: ఆరుగురు మంత్రులు కూడా, ఉచితాలపై ఇలా
బుల్లి మఫ్లర్మ్యాన్కు.. ఆప్ ఆహ్వానం
అవ్యన్ తోమర్ అనే చిన్నారి.. అరవింద్ కేజ్రీవాల్ వేషాధారణలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశారు. బుల్లి మఫ్లర్ మ్యాన్ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపించారు. అందరి దృష్టినీ ఆకర్షించిన ఆ బుల్లి మఫ్లర్ మ్యాన్కి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆప్ నుంచి ఆహ్వానం కూడా లభించింది.
బుడ్డోడితో సెల్ఫీల కోసం పోటాపోటీ..
ఈ నేపథ్యంలో ఆ బుల్లి మఫ్లర్ మ్యాన్.. కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యాడు. అక్కడ ఈ బుడ్డోడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అక్కడికి వచ్చిన వారంతా అతడ్ని చూసేందుకు ఎగబడ్డారు. అంతేగాక, అతనితో సెల్ఫీలకు పోటీపడ్డారు. మీడియా ప్రతినిధులను కూడా అతడు ఆకర్షించాడు.
బుడ్డోడితో ఎమ్మెల్యేలు కూడా..
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలు భగవంత్మాన్, రాఘవ్ చద్దా, సోమ్నాథ్ భారతి కూడా ఆ పిల్లాడితో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో ఈ బుడ్డోడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయాడు. ఇతడితోపాటు మరికొందరు చిన్నారులు కూడా అరవింద్ కేజ్రీవాల్ వేషాధారణలో ఆకట్టుకున్నారు.
మూడోసారి ఢిల్లీ పీఠంపై అరవింద్ కేజ్రీవాల్..
ఆదివారం మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మనీష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా భారత్ మాతా కీ జై, వందేమాతరం అనే నినాదాలు కూడా చేశారు కేజ్రీవాల్. ఢిల్లీని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్బంగా తెలిపారు. ప్రచారంలో భాగంగా తమపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమించేస్తున్నామని అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఇదే వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు కోరుతున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపలేదని.. అన్ని వర్గాలకు కలుపుకొనిపోయామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మీ బిడ్డ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడని ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఢిల్లీ అంతా ఇప్పుడు తన కుటుంబమే అని, అందరి కోసం పనిచేస్తామన్నారు.