మంగళూరు విమానాశ్రయంలో ఐఈడీ బాంబు: నిందితుడి ఫొటోలు విడుదల
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐఈడీ బాంబు కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద అనుమానాస్పద ల్యాప్టాప్ బ్యాగ్ ఉందంటూ సమాచారం రావడంతో విమానాశ్రయ పోలీసులు, ఉన్నతాధికాధికారులు అక్కడికి చేరుకున్నారు.
బెంగళూరు పోలీసు శాఖలో భాగమైన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) ఘటనా స్థలానికి చేరుకుని ఆ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాగ్ను థ్రెట్ కంటైన్మెంట్ వాహనంలో ఉంచి.. కిలోమీటరు దూరంలో కెంజార్లోని బహిరంగ స్థలానికి తీసుకెళ్లి పరిశీలించారు.
బ్యాగ్లో మెటల్ కాయిన్ బాక్స్ ఉందని.. అందులో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు ఉంచారని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు విమానాశ్రయం వద్ద మోహరించారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అధికారులు.. ఆ బ్యాగ్ను విమానాశ్రయంలో పెట్టిన నిందితుడి ఫొటోలను గుర్తించి విడుదల చేశారు.
Karnataka: Mangaluru Police releases photographs of suspect and the autorickshaw he was seen leaving in, in the CCTV footage. A suspicious bag was found at Mangaluru Airport today. https://t.co/9X3seeADZC pic.twitter.com/NKeak3rwnz
— ANI (@ANI) January 20, 2020
అలాగే నిందితుడు వెళ్లిన ఆటో రిక్షా ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) డీఐజీ అనిల్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఆ బ్యాగ్ను మంగళూరు విమానాశ్రయంలో పెట్టి.. ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాంబు నిర్వీర్యం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. విమానాశ్రయం నుంచి అన్ని విమానాలు షెడ్యూల్డ్ ప్రకారమే నడుస్తున్నాయని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ వీవీ రావు వెల్లడించారు. బాంబు కలకలం నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు.. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.