కాంగ్రెస్ దెబ్బకు గోవాలో బీజేపీ గూబ గుయ్యిమంది
2017 గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. గోవాలో పార్టీలవారీగా పొందే ఫలితాలను చదవండి. ఆప్, కాంగ్రెసు, ఎంజిపి, బిజెపి గోవాలో ఎన్నెన్ని సీట్లు గెలుచుకున్నాయో చదవండి.
నాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. గోవాలో 40 శాసనసభా స్థానాలున్నాయి. ఇక్కడ బిజెపి తన ఆధిక్యతను నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదని కూడా అంచనా వేశాయి. గోవాలో మేజిక్ ఫిగర్ 21. గోవాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే, మేజిక్ ఫిగర్కు అటు ఇటు రావొచ్చని చెప్పాయి. ఒకటి రెండు సీట్లు తక్కువ పడితే సారూప్య పార్టీలు లేదా స్వతంత్రులతో కమలం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది.
3:40PM: గోవాలో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించింది. 11 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గోవాలో 9మంది ఇతరులు విజయం సాధించారు. మరో అభ్యర్థి ముందంజలో ఉన్నారు. గోవాలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీలు కీలకం అయ్యాయి.
12:54AM: మయెం నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ జంతీ, పోరియం నియోజక వర్గంలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణె విజయం సాధించారు. ప్రియోల్ నియోజక వర్గంలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ అభ్వర్థి దీపక్ మహదేవ్ ముందంజలో ఉన్నారు.
12:30AM: దబోలీం నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి హెలియోడొరొ గొడిన్జో, బెనౌలిం నియోజక వర్గంలో ఎన్ సీపీ అభ్యర్థి చర్చిల్ అలెమావ్రో, శిరోడ్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుభాష్ శిరోడ్కర్, మపుసా నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి, గోవా డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా, ప్రియోల్ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థి గోవింద్ గౌడ విజయం సాధించారు.
11:15AM: మాండ్రెసం నియోజక వర్గం నుండి పోటీ చేసిన ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కాంగ్రెస్ అభ్వర్థి దయానంద్ సోప్టే చేతిలో దాదాపు 3,500 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. సీఎంనే ఓడించిన దయానంద్ ను కాంగ్రెస్ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
11:00AM: పిబ్రవరి 4వ తేదీన జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో ఓటింగ్ లో పాల్గోన్న ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలిపే ఎన్నికల కౌంటిగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 11 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది.
10:30AM: గోవాలో బీజేపీకి అనుకోని రీతిలో దెబ్బపడింది. మాడ్రెం నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమిపాలైనారు. ముఖ్యమంత్రి లక్ష్మికాంత్ పర్సేకర్ తో పోటీ పడిన కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే అక్కడ విజయం సాధించారు. లక్ష్మీకాంత్ పర్సేకర్ నాయకత్వంపై సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది.
9:40AM: కాంగ్రెస్ పార్టీ గోవాలో అధికారంలో ఉన్న బీజేపీకి ఝలక్ ఇచ్చే పరిస్థితి కనినిస్తోంది. బీజేపీ ఐదు స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ముందుకు దూసుకుపోతోంది. ఇదే జరిగితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. మరో పక్క ఆప్, మహారాష్ట్ర గోమంతక్ పార్టీలు బరిలో ఉన్నాయి.
9:20AM: గోవా మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారీకర్ మళ్లీ గోవా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్ మొదలుకాక ముందే ఆయన ప్రత్యేక పూజలు చేసి గోవాలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రార్థనలు చేశారు. మనోహర్ పారీకర్ సన్నిహితులు, ఆయన స్నేహితులు మీరే మళ్లీ గోవా సీఎం కావాలని కోరుకుంటున్నారు.
8:30AM: 40 మంది శాసన సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 19 నుంచి 22 సీట్లు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో సీఎం ఎవరనే దానిపైనే ఆసక్తి నెలకొంది. గోవా ఎన్నికల ప్రచారాన్ని కేంద్రమంత్రి పారీకర్ ముందుడి నడిపారు. గోవాకు మళ్లీ సీఎంగా పారీకర్ వస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.