రాజ్యాంగపరమైన కేసులను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Recommended Video
ఢిల్లీ: రాజ్యాంగపరమైన కేసుల్లో మాత్రమే కోర్టులో జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. సుప్రీం కోర్టులో జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న పిటిషన్ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసం ఈ పిటిషన్ను విచారణ చేసింది. రాజ్యాంగపరమైన కేసులు, రాజ్యాంగ ప్రాముఖ్యత కలిగిన సామాజిక అంశాల కేసులను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అంగీకారం తెలిపింది. ఆగష్టు 17కు కేసును వాయిదా వేసింది.
సుప్రీం కోర్టులో వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై విధివిధానాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తమ వైపు నుంచి కూడా కొన్ని సూచనలు చేసి ఒక నివేదిక అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్కు అందించాలని పిటిషనర్లను కోర్టు ఆదేశించింది. అంతకుముందు జరిగిన విచారణలో కోర్టు హాలులోని కేసుల వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా ఈ తరహా పద్ధతిపై సానుకూలంగా ఉందని... ఎమర్జెన్సీ కింది ఇది తీసుకుని ముందుగా ప్రధాన న్యాయమూర్తి హాలు నుంచే కేసు వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు అటర్నీ జనరల్ వేణుగోపాల్.
రాజ్యాంగపరమైన అంశాలను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసిన ఏజీ... న్యాయవాదులకు, న్యాయనిపుణులకు ఇలాంటి కేసుల్లో ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక కోర్టు ప్రాంగణంలో కూడా చిన్నపాటి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ...లాయర్లు కూడా వీక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. మరోవైపు కోర్టులో జరిగే వాదనల వీడియో క్లిప్పింగులను కమర్షియల్గా వాడుకునే వీలులేకుండా చూడాలని ఈ కేసులో పిటిషనర్ ఇందిరా జైసింగ్ అన్నారు.