నితీశ్పై పోరుకు రంకెలేస్తున్న లోక్జనశక్తి- గతానుభవాలు చూస్తే షాక్ కావడం ఖాయం..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటమి మధ్యే పోరు జరుగుతుందని భావిస్తున్నా లోక్ జనశక్తి కూడా తాము సత్తా చూపుతామని సవాళ్లు విసురుతోంది. అయితే లోక్ జనశక్తి పోరు మహాకూటమితోనే కాదు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జేడీయూపై కూడా. అందుకే జేడీయూ టార్గెట్గా నిత్యం లోక్జనశక్తి నేత చిరాగ్ పాశ్వాన్ నిప్పులు చెరుగుతున్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న బీజేపీతో కలిసి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే వాస్తవానికి లోక్ జనశక్తి ట్రాక్ రికార్డు గమనిస్తే మాత్రం జేడీయూతో పోటీ పడే సత్తా లోక్జనశక్తికి లేదని అర్ధమవుతుంది. 2010లో ఇలాగే జేడీయూకు పోటీగా బరిలోకి దిగిన లోక్ జనశక్తి పార్టీ అభ్యర్ధులు దారుణ పరాజయాలు చవిచూశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 75 సీట్లలో పోటీ చేసిన లోక్ జనశక్తి పార్టీ... ఒక్క జేడీయూ చేతిలోనే 27 చోట్ల ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత 2015 అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్ జనశక్తి పార్టీ 22 సీట్లకు పోటీ చేసి 21 చోట్ల ఓటమి పాలైంది. వారిస్ నగర్, త్రివేణీ గంజ్, సోన్బర్షా వంటి చోట్ల అయితే ఎల్జేపీ అభ్యర్ధులు 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
మరోసారి బీహార్ పోరులో జేడీయూను టార్గెట్ చేసిన లోక్ జనశక్తి పార్టీ ఈసారి కూడా నితీశ్ పార్టీ పోటీ చేస్తున్న స్ధానాల్లో అభ్యర్ధులను నిలబెట్టడమే కాకుండా బీజేపీకి పరోక్షంగా సాయం చేస్తోంది. ఈ ఎన్నికల్లో జేడీయూకు తక్కువ స్ధానాలు వస్తే ఆ మేరకు బేరాలాడి సీఎం సీటు తీసుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ.. లోక్జనశక్తి రూపంలో సవాళ్లు విసురుతోంది. అయినా నితీశ్ ఇవేవీ పట్టనట్లుగా తన పని తాను చేసుకుపోతున్నారు. లోక్జనశక్తి ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకూ ఒక్క ఎన్నికల్లోనూ జేడీయూ, లోక్ జనశక్తి కలిసి పోటీ చేయలేదు. ఈసారి కూడా జేడీయూ లక్ష్యంగా బరిలోకి దిగడం ద్వారా సత్తా చాటేందుకు పాశ్వాన్ పార్టీ ప్రయత్నిస్తున్నా ఆ కల నెరవేరేలా కనిపించడం లేదు.