ఎల్జేపీ విఫలమైనా.. నేతగా ఎదిగిన చిరాగ్ పాశ్వాన్
పాట్నా: ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) పేలవ ప్రదర్శనే చూపింది. అయితే, చిరాగ్ మాత్రం ఎన్నికల్లో తన ప్రభావాన్ని చాటారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనే లక్ష్యంగా చేసుకుని ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.
చిరాగ్ పాశ్వాన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎక్కువగా జేడీయూ పోటీ చేసిన స్థానాల్లోనే చిరాగ్ పాశ్వాన్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం గమనార్హం. దీంతో జేడీయూ ఓట్లను చీల్చి ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది ఎల్జేపీ.
బీహార్ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీ కేవలం ఒకే ఒక్క స్థానంలోనే గెలుపొందింది. అది కూడా పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ విజయం సాధించారు. అయితే, చిరాగ్ పాశ్వాన్ పార్టీ సుమారు 5 శాతం కంటే ఎక్కువగానే ఓటు షేర్ సాధించడం గమనార్హం.
జేడీయూ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఎల్జేపీ అభ్యర్థులు పోటీ చేశారు. దాదాపు 40 స్థానాల్లో జేడీయూ ఓటమికి ఎల్జేపీనే కారణం కావడం గమనార్హం. ఎన్డీఏ, బీజేపీపై విమర్శలు చేయకుండా కేవలం నితీష్ కుమార్నే లక్ష్యం చేసుకుని చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. చిరాగ్ పాశ్వాన్ తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు.
తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ఎన్నికల ముందే మృతి చెందినప్పటికీ.. చిరాగ్ పాశ్వాన్ తన భుజాలపైన పార్టీ బాధ్యతలను తీసుకుని పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీకి తాను భక్తుడినంటూనే.. నితీశ్పై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ ఓటర్లను ఆకట్టుకోవడంలో చిరాగ్ పాశ్వాన్ కొంతమేర విజయవంతమైనట్లేనని చెప్పవచ్చు. రాబోయే ఎన్నికల్లో తన ప్రభావం మరింత ఉండనుందని ఈ ఫలితాల ద్వారా తెలియజేవారు ఈ యువనేత.