ఉద్యోగాల ప్రలోభం... అత్యాచార పర్వం... ఆపైన బలవంతపు వ్యభిచారం
గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో.. ఉద్యోగాల పేరిట ప్రలోభానికి గురిచేసి యువతులపై అత్యాచారం చేయడమే కాక వారిని వ్యభిచార వృత్తిలోకి దింపిన బీజేపీ కార్యకర్తల బాగోతమిది.
కచ్: ఉద్యోగాల పేరిట ప్రలోభానికి గురిచేసి యువతులపై అత్యాచారం చేయడమే కాక వారిని వ్యభిచార వృత్తిలోకి దింపిన బీజేపీ కార్యకర్తల బాగోతమిది. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో వెలుగుచూసింది.
గుజరాత్ లోని కచ్ కు చెందిన ఓ యువతికి నెలకు రూ.5,500 వేతనంతో ఉద్యోగమిస్తానని చెప్పి తన ఇంటికి పిలిపించుకున్న బీజేపీ కార్యకర్త, గ్యాస్ ఏజెన్సీ యజమాని అయిన సోలంకి.. ఆ మేరకు జీతం అడ్వాన్స్ ఇచ్చి.. ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా బాధిత యువతిని ఆ తరువాత హోటళ్లు, ఇళ్లలోకి మార్చుతూ పలువురు అత్యాచారం చేశారని వారు పేర్కొన్నారు. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. మొత్తం 35 మంది యువతులపై ఐదుగురు బీజేపీ కార్యకర్తలు అత్యాచారం చేయడమే కాకుండా.. వారిని వ్యభిచార వృత్తిలోకి దించినట్లుగా పోలీసులకు ఆ యువతి నుంచి ఫిర్యాదు అందింది.
మొత్తం 9 మంది నిందితులతో కూడిన ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కచ్ జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్తలు శాంతిలాల్ సోలంకి, అబ్దాస, గోవింద్ పారుమలానీ, అజిత్ రమావాణి, వసంత్ భానుశాలిలపై కేసు నమోదు చేశారు.
పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ ఐదుగురు కార్యకర్తలను తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కేసీ పటేల్ వెల్లడించారు.
అయితే, ఈ అత్యాచారాలు, బలవంతపు వ్యభిచారం బాగోతం వెనుక బీజేపీ పెద్ద నేతల హస్తముందని, ఈ ఉదంతంపై న్యాయవిచారణ జరిపించాలని, కాంగ్రెస్, ఆప్ నాయకులు డిమాడ్ చేశారు.
ఒకవైపు అత్యాచారం కేసులో నిందితులైనందున తమ పార్టీ కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకటించగా... మరోవైపు నిందితులు నకిలీ పార్టీ గుర్తింపు కార్డులతో బీజేపీ కార్యకర్తలుగా చెలామణీ అవుతున్నారని, వారికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా ఖండించారు.
ఈ ఘటన కారణంగా పార్టీకి మరింత చెడ్డపేరు రాకూడదన్న భావనతో గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా కూడా స్పందించారు. నిందితులు ఏ స్థాయిగల వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని వ్యాఖ్యానించారు.