ఇంకొద్ది గంటల్లో నిమ్మగడ్డ అఖిలపక్షం -హాజరుపై ఎటూ తేల్చని జగన్, పవన్ - స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, కొత్త కేసుల నమోదు తగ్గినప్పటికీ ఎన్నికల నిర్వహణకు ఇది అనుకూల సమయం కాదని జగన్ సర్కారు భావిస్తోన్న నేపథ్యంలో అఖిలపక్షం భేటీకి వైసీపీ హాజరవుతుందా? లేదా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
అడ్డంగా దొరికిన విజయసాయిరెడ్డి - మోదీ-జగన్ మధ్య ఉల్కాపాతం -పోలవరం అసలు కథ: ఎంపీ రఘురామ
కోర్టు సూచనతో అఖిలపక్షం..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన ఎన్నికలను నిమ్మగడ్డ ఆరు వారాలకు వాయిదా వేయడం, ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా నిరవధిక వాయిదా పడటం, ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు నిమ్మగడ్డను పదవి నుంచి తప్పించడం, కనగరాజ్ ను నూతన ఎస్ఈసీగా నియమించడం, కోర్టు తీర్పుతో తిరిగి రమేశ్ కుమారే పదవిలో చేరడం తెలిసిందే. ఆఫీసు ఖర్చులకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదంటూ నిమ్మగడ్డ ఇటీవల మరోసారి కోర్టును ఆశ్రయించడం విదితమే. స్థానిక ఎన్నికలపై దాఖలైన పిటిషన్ ను ఇటీవల విచారించిన హైకోర్టు.. అఖిలపక్షం నిర్వహించాల్సిందిగా నిమ్మగడ్డకు సూచించడంతో ఆమేరకు ఎస్ఈసీ కార్యాలయం అన్ని పార్టీలకు లేఖలు పంపింది..
ఉదయం 10.40కి మీటింగ్..
విజయవాడలోని కార్యాలయంలో బుధవారం ఉదయం 10.40 నిమిషాలకు ఎస్ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ.. ప్రతినిధులను పంపాల్సిందిగా కమిషన్ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనల్ని ఈసీ నోట్ చేసుకోనున్నారు. కాగా,
ఇంకా తేల్చని జగన్, పవన్..
ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో జరుగనున్న అఖిలపక్ష సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, బీజేపీ నుంచి పాక సత్యనారాయణ హాజరు కానున్నట్లు ఆ పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. కానీ వైసీపీ, జనసేన నుంచి ఎవర్ని పంపాలనేదానిపై ఆ పార్టీల అధినేతలు జగన్, పవన్ కల్యాణ్ లు ఇంకా నిర్ణయించుకోలేదు. సీపీఐ సైతం భేటీకి వెళ్లడంపై క్లారిటీ ఇవ్వలేదు. స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ సర్కారుకు వ్యతిరేక ధోరణిలో వెళుతున్నందున భేటీని వైసీపీ బహిష్కరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో..
నిమ్మగడ్డ దిగిపోయాకే ఎన్నికలు?
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ముగిసేదాకా(వచ్చే ఏడాది మార్చి 31) ఎన్నికలు జరపకూడదని సీఎం జగన్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈలోపే ఏపీ సర్కారు.. సోమవారం రాత్రి కరోనా వైరస్ నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' భేటీ ఏర్పాటు చేయడం, ఆ సమావేశంలో సీఎం ప్రధాన సలహాదారు అజేయకల్లం,సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొననారు. కరోనాతోపాటు ఎన్నికలపైనా వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నవంబర్ 4వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామ