లాక్ డౌన్ 3.0 : మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. ఇక పండగే..
రెండో విడత లాక్ డౌన్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ను పొడగించింది. అయితే ఈసారి జోన్ల వారీగా సడలింపులతో కూడిన లాక్ డౌన్ను ప్రకటించింది. ప్రయాణాలు,జనం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలపై యథావిధిగా నిషేధాన్ని కొనసాగించినప్పటికీ.. మునుపటితో పోలిస్తే ఆరెంజ్ జోన్లు,గ్రీన్ జోన్లలో కాస్త ఎక్కువ సడలింపులే ఇచ్చింది. ఇక అన్నింటికీ మించి మందు బాబులకు ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త చెప్పింది.
గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలు,పాన్,సిగరెట్ల విక్రయాలకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే మద్యం దుకాణాలు,పాన్ డబ్బాల వద్ద కనీసం ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న నిబంధన పెట్టింది. అలాగే ఒకసారి కేవలం ఐదుగురిని మాత్రమే షాపు వద్దకు అనుమతిస్తారని చెప్పింది.
లాక్ డౌన్ పీరియడ్లో వలస కూలీల అంశంతో పాటు మద్యం కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. మద్యం దుకాణాలు ఒక్కసారిగా మూతపడటంతో చాలాచోట్ల మందు బాబులు పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు. కొన్నిచోట్ల వైన్ షాపుల్లో దొంగతనాలు కూడా జరిగాయి. ఇక హైదరాబాద్ సహా పలు నగరాల్లో అక్రమ మద్యం విక్రయాల దందాలు కూడా బయటపడ్డాయి. పైగా ప్రభుత్వాల ఆదాయం కూడా దారుణంగా పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం లిక్కర్ విక్రయాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాలి.