కరెంట్ లెక్కలు.. ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇదీ దేశంలో పరిస్థితి..
కరోనా లాక్ డౌన్ కారణంగా భారత్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పడిపోయింది. పరిశ్రమలు,బిజినెస్ యాక్టివిటీస్ నిలిచిపోవడంతో ఏప్రిల్ నెలలో విద్యుత్ వినియోగం 22.7శాతం పడిపోయింది. గతేడాది ఇదే ఏప్రిల్ నెలలో 110.11 బిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించబడగా.. ఈ ఏడాది ఏప్రిల్లో మాత్రం 85.05బిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగించబడింది. గతేడాది ఏప్రిల్ నెలలో పీక్ పవర్ డిమాండ్(ఒకరోజులో పగటిపూట దేశవ్యాప్తంగా అత్యధిక విద్యుత్ సరఫరా) 176.81గిగా వాట్స్ కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అది 132.77 గిగా వాట్స్గా నమోదైంది.
విద్యుత్ వినియోగం పడిపోవడానికి కారణమేంటి..
ఈసారి వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం మునుపటి కంటే తక్కువగా ఉండటం కూడా విద్యుత్ వినియోగాన్ని ప్రభావం చేసింది. సాధారణంగా వేసవిలో దేశంలోని చాలా ప్రాంతాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ అకాల వర్షాల కారణంగా వాతావరణం చల్లబడటంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు,నాన్-కంటైన్మెంట్ జోన్లలో కార్మికుల కొరత,ప్రయాణ ఆంక్షలతో చాలావరకు పారిశ్రామిక యూనిట్లలో ఇంకా యాక్టివిటీస్ ప్రారంభం కాలేదు. దీంతో విద్యుత్ వినియోగం పెద్దగా పెరగలేదు.
పెరిగే అవకాశం ఉందా..?
అయితే 'మే'లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటం,చాలావరకు పరిశ్రమలు తెరుచుకుంటుండటంతో.. విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. అయితే గతేడాది విద్యుత్ వినియోగాన్ని చేరుకోవడానికి మాత్రం కచ్చితంగా ఇంకాస్త సమయం పడుతుందంటున్నారు. తగ్గిన విద్యుత్ వినియోగం చాలావరకు విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై ప్రభావం చూపించింది. ఇప్పటివరకూ జారీ చేసిన 20-25శాతం బిల్లులను కూడా వారు వసూలు చేయలేకపోయారు.
విద్యుత్ కంపెనీలు ఏమంటున్నాయి..
ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి తప్ప.. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు,రవాణా చార్జీలను భరించే ఆర్థిక స్థోమత తమ వద్ద లేదని విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చెబుతున్నాయి. లాక్ డౌన్ పొడగింపు నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని వాపోతున్నాయి. ఇందులో చాలావరకు కంపెనీలు ఇప్పటికే ఇండస్ట్రియల్&రెసిడెన్షియల్ విద్యుత్ బిల్లుల చెల్లింపుకు గడువును పొడగించాయి.
Recommended Video
రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళన..
ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రైవేటు సంస్థలచే నిర్వహించబడుతున్న విద్యుత్ ప్లాంట్లు బ్యాంక్ హామీలను కోల్పోవడం లేదా విద్యుత్ సరఫరాను తగ్గించడం చేయవచ్చునని ఆందోళన పడుతున్నాయి. అదే జరిగితే తరచూ విద్యుత్తు అంతరాయం,బ్లాక్ అవుట్స్కు దారితీస్తుందని భావిస్తున్నాయి. విద్యుత్ డిమాండ్ తగ్గి నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రూ.500బిలియన్ల రుణాలను అందించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం భారత్లో ఉత్పత్తి అవుతోన్న మొత్తం విద్యుత్లో మూడు వంతులు బొగ్గు ద్వారా జరుగుతోంది. అయితే విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాలో బొగ్గు అమ్మకాలు కూడా పడిపోయాయి.