లాక్ డౌన్ వేళ: యూట్యూబ్ లో ఎక్కువగా ఏం చూస్తున్నారో తెలుసా !!
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద దారుణంగా పడినా యూట్యూబ్ కు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా వంటల ఛానళ్ళకు పండుగే పండుగ . ఇళ్లకే పరిమితం అవుతున్న జనాలు యూట్యూబ్ ను దున్నేస్తున్నారు. ఎక్కువగా వంటల ఛానళ్ళను చూసి పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు . కొత్త కొత్త వంటలను యూట్యూబ్ లో చూసి ఆహా ఏమి రుచి అంటూ వంటలు చేసేస్తున్నారు . చాలా మంది ఇళ్ళల్లో వంటల ఘుమఘుమలతో ఒక వేడుక వాతావరణం కనిపిస్తుంది.
కరోనా నేర్పిన జీవితం: సింపుల్ గా బతకటానికి అలవాటు పడుతున్న జనాలు
ఇంటింటా ఘుమఘుమలు .. లాక్ డౌన్ ఎఫెక్ట్
కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. కరోనా వైరస్ ప్రబలకుండా విధించిన లాక్ డౌన్ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకు వస్తుంది. ఒకప్పుడు నిత్యం హోటల్ ఫుడ్స్ కు అలవాటు పడిన వాళ్ళు ఎంచక్కా రుచిగా, శుచిగా ఇళ్లలోనే వండుకు తింటున్నారు. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్న క్రమంలో బయట హోటళ్ళు, రెస్టారెంట్లు కూడా మూసివేశారు . దీంతో ప్రతి ఇంట్లో నలభీముల్లా వంటలను ఘుమఘుమలాడిస్తున్నారు. అది, ఇది అని లేకుండా అన్ని రకాల వంటలను చేసి రుచి చూస్తున్నారు .
సినిమాల కంటే యూట్యూబ్ లో కొత్త వంటలే ఎక్కువ ఆసక్తి
లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రజలు టీవీలో వస్తున్న సీరియల్ సినిమాలకంటే యూట్యూబ్ లో కొత్త వంటలు, కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా యూట్యూబ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది . ముఖ్యంగా వంట చానళ్ళ వాళ్లకు మంచి బిర్యాని చేసుకు తిన్నంత ఆనందంగా ఉంది. వంట చానళ్ళ మీద జనాలు ఎక్కడలేని ఆసక్తి చూపిస్తూ ఉండటమే అందుకు కారణం . ఈ క్రమంలో వంట ఛానల్స్ వీడియోలకు బాగా డిమాండ్ పెరిగింది . చాలామంది వ్యూయర్స్ వంట వీడియోస్ ని చూస్తూ వంటలు చేసేస్తున్నారు. దీంతో సదరు చానల్స్ కి గిరాకీ బాగా పెరిగింది . వాళ్ళ రెవెన్యూ మాత్రం బ్రహ్మాండంగా ఉంది .
యూట్యూబ్ లో వంటల వీడియోలు తెగ చూస్తున్న జనాలు
లాక్ డౌన్ కారణంగా కుటుంబ సభ్యులంతా ఇంటికే పరిమితం కావటం , లాక్ డౌన్ వల్ల ఏర్పడిన ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇప్పుడు అందరికీ వచ్చిన రెస్ట్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకోవటం వెరసి రుచిగా వండుకోవటం , ఫ్యామిలీతో సరదాగా ఆడుకోవటం , ఇష్టమైన సినిమాలు చూడటం పనిగా పెట్టుకున్నారు . ఇక అందుకే రుచికరమైన సరికొత్త వంటకాల కోసం అందరూ యూట్యూబ్ మీద పడ్డారు .ఇంగ్లిష్, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల వంట వీడియోలను చూసేస్తున్నారు . ఏం వంట అయినా మాకు రాదు అనకుండా వండేస్తున్నారు .
కుకరీ ఛానల్స్ కు కాసుల పంట .. యూ ట్యూబ్ లో ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు వంట వీడియోలకే
ముఖ్యంగా తెలుగులో కుకరీ ఛానెళ్లు నడుపుతున్న వారి సబ్ స్క్రిప్షన్ భారీగా పెరిగిపోతోంది. డౌన్ లోడ్లు, వ్యూస్ ఎక్కువగా ఉండటంతో వారికి రెవెన్యూ కూడా బాగానే వస్తుంది. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ తో యూట్యూబ్ లో వంటల చానళ్లకే మొదటి స్థానం అని తాజా వ్యూవర్ షిప్ చెప్తుంది . ఏది ఏమైనా గతంలో ఎప్పుడూ ఇంతగా కిచెన్ లో కష్టపడని వాళ్ళు కూడా కిచెన్ లో వంటలతో కష్టపడుతున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా వంటల వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తుండటం విశేషం .