Lockdown: గంధర్వకోటలో కలకలం, నీళ్ల కోసం వెళ్లిన 13 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, అతి తెలివితో ?
చెన్నై/ పుదుకోటై: లాక్ డౌన్ అమలు కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్న పాఠశాల విద్యార్థిని సమీపంలోని తైలం తోటలో నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ఆమెపై కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబుతోందనే అభయంతో బాలిక గొంతు నులిమి తోటలో విసిరివేశారు. కొన ఊపిరితో ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స విఫలమై మరణించింది. 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చెయ్యడంతో గంధర్వకోటలో కలకలం రేపింది. అతి తెలివి ప్రదర్శించిన నలుగురు కామాంధులు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు. బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
lockdown: లాక్ డౌన్ లో గుడిలో ప్రేమ పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య, నెల రోజుల్లో ఏం జరిగింది ?
వేసవిలో ఊట నీళ్లే గతి
తమిళనాడులోని పుదుకోటై జిల్లా గంధర్వకోటలోని తైలం తోట గ్రామస్తులకు వేసవి వచ్చిందంటే తాగడానికి ఊట నీళ్లే వారికి గతి. వేసవిలో గ్రామంలో తాగడానికి నీళ్లు కరువు వస్తుంది. వేసవిలో తైలం తోట గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లోని తైలం తోటలు దాటుకుని వెళ్లి అటువైపు ఉన్న ఊట బావుల్లో నీళ్లు తెచ్చుకుని తాగుతుంటారు.
13 ఏళ్ల పాఠశాల విద్యార్థిని
తైలం తోట గ్రామంలో 13 ఏళ్ల బాలిక నివాసం ఉంటున్నది. లాక్ డౌన్ అమలు కావడం, స్కూలు మూసివేయడంతో బాలిక ఇంట్లోనే ఉంటున్నది. తాగడానికి నీళ్లు ఖాళీ అయిపోవడంతో ఊట బావిలో నీళ్లు తీసుకువస్తానని తల్లికి చెప్పిన బాలిక రెండు బిందెలు తీసుకుని తైలం తోటలకు అటు వైపు ఉన్న ఊట బావుల దగ్గరకు వెళ్లింది.
బాలికపై సామూహిక అత్యాచారం
బాలిక ఒంటరిగా ఊట బావుల వైపు వెలుతున్న విషయం గుర్తించిన ఆ గ్రామంలోని యువకులు ఆమెను వెంబడించారు. తరువాత తైలం తోటలు దాటి వెలుతున్న బాలికను లాక్కెళ్లిన కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక ఇంటికి వెళ్లి ఎక్కడ తమ మీద కుటుంబ సభ్యులకు చెబుతుందో అనే ఆందోళనతో ఆమె గొంతు నులిమి చనిపోయిందని భావించి సమీపంలోని తైలం తోటల్లో విసిరేసి వెళ్లిపోయారు.
కొన ఊపిరితో ఉంటే !
బాలిక తాగు నీటి కోసం వెళ్లి ఎంత సేపటికి తిరిగి రాకపోవడతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు గాలించడం మొదలు పెట్టారు. ఎక్కడా బాలిక అచూకి లేకపోవడంతో అనుమానం వచ్చి తైలం తోటల్లో గాలించడం మొదలుపెట్టారు. ఓ తైలం తోటలో బాలిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో బాలిక జరిగిన విషయం మొత్తం కుటుంబ సభ్యులకు చెప్పింది. చికిత్స విఫలమై బాలిక మంగళవారం మృతి చెందడంతో గంధర్వకోటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుల కోసం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు గాలించడం మొదలుపెట్టారు.
అతి తెలివి పట్టించింది
గంధర్వకోటలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనడంతో పుదుకోటై పోలీసులు రంగంలోకి దిగారు. అయితే బాలికపై అత్యాచారం చేసి ఏమీ తెలియని అమాయకులుగా నటిస్తూ మేమే నిందితులను పట్టుకుంటాం అంటూ హంగామా చేస్తున్న నలుగురు యువకుల మీద పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బెండ్ తియ్యడంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాలిక మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నలుగురు అనుమానితులను విచారణ చేస్తున్నామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పుదుకోటై పోలీసు అధికారులు తెలిపారు.