లాక్డౌన్ 4.0: కొత్త రూల్స్ కఠినతరం.. తెలంగాణకు షాక్.. ఏపీకి ఊరట..కొత్త కేసుల్లో దేశ రికార్డు బద్దలు
వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం చేపట్టిన దేశ వ్యాప్త లాక్ డౌన్ నాలుగో దశకు చేరినా, కరోనా విలయం ఇంకా తగ్గలేదు. పైగా, కొత్త కేసుల విషయంలో ఆదివారం సరికొత్త రికార్డు నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,987 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం సంఖ్య 91వేలకు చేరింది. మరణాల సంఖ్య 2,872కు పెరిగింది. కొవిడ్ బాధిత దేశాల జాబితాలో ఇప్పటికే చైనాను అధిగమించిన భారత్ తాజాగా పెరూను కూడా దాటేసి, టాప్-10 చోటు కోసం ఇరాన్ తో పోటీపడుతుండటం విషాదకరం. ఇదిలా ఉంటే, సోమవారం నుంచి అమలులోకి రానున్న లాక్ డౌన్ 4.0కు సంబంధించి కేంద్రం తాజా మార్గదర్శకాలు ఇలా ఉండనున్నాయి..
Recommended Video
ఆ 30 తప్ప మిగతా ఓపెన్..
మార్చి 25 నుంచి కొనసాగుతోన్న లాక్ డౌన్ కు సంబంధించి ఇన్నాళ్లూ ప్రతి చిన్న అంశాన్నీ కేంద్రమే నిర్ణయిస్తూ రాగా, ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్నట్లు లాక్ డౌన్ 4.0 మాత్రం పూర్తి భిన్నంగా ఉండబోతున్నది. జోన్ల గుర్తింపు, ఎక్కడ ఏయే వ్యాపారాలకు అనుమతివ్వాలనే నిర్ణయాధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కాయి. కేంద్రం పరిమితంగానే జోక్యం ప్రదర్శించినప్పటికీ ఆ రూల్స్ మరింత కఠినంగా ఉండటం గమనార్హం. మిగతా ప్రాంతాలపై నిర్ణయాధికారాల్ని రాష్ట్రాలకే వదిలేసిన కేంద్రం.. ఓ 30 జోన్ల విషయంలో మాత్రం తానే గైడ్ లైన్స్ రూపొందించింది. తద్వారా సోమవారం నుంచి ఆ 30 ప్రాంతాలు తప్ప మిగతా చోట్ల కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి..
85 శాతం కేసులు ఆ 30 జోన్లలోనే..
గతంలో జిల్లాల వారీగా జోన్లను విభజించిన కేంద్ర సర్కారు.. లాక్ డౌన్ 4.0లో మాత్రం మున్సిపల్ కార్పొరేషన్లు లేదా మున్సిపాలిటీ ఏరియాలను మాత్రమే జోన్లుగా పేర్కొనడం గమనార్హం. మన దేశంలో వైరస్ ప్రభావం అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఉండటం తెలిసిదే. కచ్చితంగా చెప్పాలంటే, మొత్తంలో 85 శాతం కేసులు కేవలం 30 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనే నమోదయ్యాయని, అందుకే లాక్ డౌన్ 4.0లో ఆ 30 కార్పొరేషన్లను మాత్రమే ప్రత్యేక జోన్లుగా ప్రకటించి, అక్కడ కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తుది దశ ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ వెలువరించాల్సిఉంది.
అవి ఎక్కడున్నాయంటే..
లాక్ డౌన్ 4.0లో భాగంగా దేశంలోని 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 30 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ గుండెకాయ గ్రేటర్ హైదరాబాద్ తోపాటు ఏపీలోని కర్నూలు కార్పొరేషన్ ఆ జాబితాలో ఉన్నాయి. వాటితోపాటు బృహన్ ముంబై కార్పొరేషన్, గ్రేటర్ చెన్నై, అహ్మదాబాద్, థానే, ఢిల్లీ, ఇండోర్, పుణె, కోల్ కతా, జైపూర్, నాసిక్, ఆగ్రా, ఔరంగాబాద్, కడలూర్, సూరత్, చెంగల్ పట్టు, అరియలూరు, హౌరా, భోపాల్, అమృత్ సర్, విల్లుపురం, వడోదరా, ఉదయ్ పూర్, ఫల్గర్, బెర్హంపూర్, సోలాపూర్, మీరట్ మున్సిపల్ కార్పొరేషన్లలో మరికొంత కాలం కఠిన ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఏపీకి ఊరట.. తెలంగాణకు దెబ్బే
లాక్ డౌన్ 4.0లో ఆంక్షలు కొనసాగుతాయంటూ కేంద్రం సిద్ధం చేసిన 30 మున్సిపాలిటీల జాబితాలో అన్నీ ప్రధాన నగరాలే ఉండటం, భారీ పరిశ్రమలన్నీ అక్కడే కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థల పున:ప్రారంభ ప్రక్రియపై మళ్లీ గందరగోళం నెలకొంది. ప్రధానంగా రాష్ట్ర ఆదాయంలో మెజార్టీ పాత్ర పోషించే గ్రేటర్ హైదరాబాద్ మరికొంత కాలం లాక్ డౌన్ లోనే ఉండాల్సి రావడం తెలంగాణకు పెద్ద దెబ్బే. అయితే సీఎం కేసీఆర్ మాత్రం.. కేంద్రం రూల్స్ లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించ కర్నూలు కార్పొరేషన్ ఒక్కటే నిషేధిత జాబితాలో ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తివేతకు సంబంధించిన పలు ఆదేశాలను సీఎం జగన్ జారీ చేసిన సంగత తెలిసిందే.
కొత్త రూల్స్ ఇలా..
కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న 30 జోన్లలో తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రజా రవాణా ప్రారంభమయ్యే అవకాశముంది. స్కూళ్లు, థియేటర్లు, జిమ్, పార్కులు, మత సంస్థల వంటి పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాలపై దేశమంతటా ఆంక్షలు కొనసాగుతాయి. స్పెషల్ ట్రైన్లు యధావిధిగా కొనసాగుతాయని, రాష్ట్రాలకు అభ్యంతరం లేకుంటే విమాన సర్వీసులను కూడా కేంద్రం ప్రారంభించే అవకాశముంది. జాబితాలోని 30 జోన్లలోనూ పార్లర్, సెలూన్లు తెరుచుకోనున్నాయి.మత సంస్థలు, మందిరాలు మూసి ఉంచుతారు. కొద్దిసేపట్లో కేంద్ర హోం శాఖ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.