lockdown: ఆకలితో సోనియా మృతి, రేషన్ కార్డుకే దిక్కులేదు, కరెంట్ బిల్లు రూ. 7 వేలు, ఈ పాపం!
ఆగ్రా/ లక్నో/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రాణాలు పోవడం పక్కన పెడితో ఆ వ్యాధి నిర్మూలించడానికి దేశ వ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురి కావడం, కూలి పనులు చెయ్యడానికి తల్లికి అవకాశం లేకపోవడంతో రెండు వారాల పాటు చుట్టుపక్కల వారు ఐదేళ్ల అమ్మాయిని కాపాడారు. అయితే వారం రోజుల నుంచి తినడానికి గంజికూడా చిక్కకపోవడంతో నీళ్లు తాగి ఆకలితో తల్లడిల్లిపోయిన 5 ఐళ్ల సోనియా అనే చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఆకలితో చిన్నారని మరణించలేదని, అనారోగ్యంతో ఆమె ప్రాణాలు పోయాయని అధికారులు వాదించడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోనియా కుటుంబ సభ్యులకు కనీసం రేషన్ కార్డు లేకపోయినా కరెంట్ బిల్లు రూ. 7 వేలు రావడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
Recommended Video
Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !
ప్రపంచంలోనే ఫేమస్
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్ భారతదేశంలోని ఆగ్రాలో ఉంది. ఆగ్రాకు ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చి వెలుతుంటారు. అయితే కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో తాజ్ మహల్ తో పాటు ఆగ్రా నగరం బోసిపోయింది. తాజ్ మహల్ (ఆగ్రా) ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం (సీఎం యోగి ఆదిత్యనాథ్) ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఫ్యామిలీని వెంటాడిన కష్టాలు
ఆగ్రా సమీపంలోని బరౌలి అహీర్ బ్లాక్ లోని నాగ్లా విద్యాచందర్ గ్రామంలో షీలాదేవి అనే మహిళ, ఆమె భర్త, కుమార్తె సోనియా (5) అమ్మాయి నివాసం ఉంటున్నారు. షీలాదేవి భర్త శ్వాసకోస సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురై ఎలాంటి పనులు చెయ్యలేక మంచానికే పరిమితం అయ్యాడు. షీలాదేవి చిన్నచిన్న పనులు చేస్తూ భర్త, కుమార్తె సోనియాను పోషించుకుంటున్నది.
లాక్ డౌన్ దెబ్బకు సోనియా బలి ?
లాక్ డౌన్ కారణంగా షీలాదేవికి ఎవ్వరూ పని ఇవ్వడానికి ముందుకురాలేదు. నెల రోజుల నుంచి షీలాదేవి ఒక్కరోజు కూడా పని చిక్కకపోవడంతో ఖాళీగా ఉంటోంది. ఇదే సమయంలో షీలాదేవి కుమార్తె సోనియాను చూసి చలించిపోయిన చుట్టుపక్కల వాళ్లు 15 రోజుల పాటు వారి దగ్గర ఉన్న బియ్యం, గోదుమ పిండి, ఆహారాధాన్యాలు షీలాదేవికి ఇచ్చారు. రెండువారాల పాటు ఒక్కపూట భోజనం చేసిన షీలాదేవి కుటుంబ సభ్యులు కాలం వెళ్లదీశారు. వారం రోజుల నుంచి షీలాదేవి, ఆమె భర్త, కుమార్తె నీళ్లు తాగి ప్రాణాలు వెళ్లదీశారు. ఆకలి బాధ తట్టుకోలని ఐదేళ్ల చిన్నారి సోనియా ప్రాణాలు విడిచింది.
ఆకలి కాదు అనారోగ్యం
సోనియా (5) ఆకలి తట్టుకోలేక చనిపోలేదని, ఆమె వారం రోజుల నుంచి జ్వరం, విరేచనాలతో బాధపడి మరణించిందని ఆగ్రా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారని ఆమె తల్లి షీలాదేవి బోరున విలపిస్తోందని ఇండియా టుడే మీడియా కథనం వెల్లడించింది. అనారోగ్యంగా ఉన్న సోనియాకు ఎందుకు మెరుగైన చికిత్స అందించలేదని, ఎందుకు ఆసుపత్రికి తరలించలేదని స్థానికులు అడిగే ప్రశ్నలకు మాత్రం ఆగ్రా ఆరోగ్య శాఖ అధికారులు వింత వాదనలు వినిస్తున్నారని స్థానిక మీడియా దుమ్మెత్తిపోస్తోంది.
రేష్ కార్డుకు దిక్కలేదు కాని కరెంట్ బిల్లు రూ. 7 వేలు
షీలాదేవిది చాలా పేద కుటుంబం. తనకు ఇంత వరకు రేషన్ కార్డు లేదని, నెల రోజుల నుంచి కూలిపనులు చెయ్యలేక, తినడానికి తిండిలేక నానా ఇబ్బందులు ఎదుర్కోన్నామని, తన కుమార్తె సోనియా అనారోగ్యానికి గురైతే మందులు కొనడానికి డబ్బులు కూడా లేవని, ఇలాంటి సమయంలో తన ఇంటికి రూ. 7, 000 కరెంట్ బిల్లు వచ్చిందని, కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్ సరఫరా కట్ చేశారని షీలాదేవి విలపించింది. మందులు కొనలేక, తన కుమార్తె సోనియా ఆకలి తీర్చలేకపోవడం వలనే ఆమె ప్రాణాలు పోయాయని, మమ్మల్ని ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని షీలాదేవి విలపిస్తోందని ఇండియా టుడే టీవీ కథనం ప్రసారం చేసింది.
సోనియా ప్రాణం విలువ రూ. 40 కేజీల బియ్యం
ఆకలితో సోనియా అనే చిన్నారని మరణించిందని వెలుగు చూడటంతో ఆగ్రా కలెక్టర్ ప్రభు ఎన్. సింగ్ విచారణకు ఆదేశించారు. తహసిల్దార్ సదర్ ప్రేపాల్ సింగ్ విచారణ చేసి చిన్నారి సోనియా అనారోగ్యంతో మరణించిందని నివేదిక సమర్పించారు. సోనియా కుటుంబ సభ్యులకు 50 కేజీల గోదమ పండి, 40 కేజీల బియ్యం అందించామని, త్వరలో రేషన్ కార్డు మంజూరు చేస్తామని అధికారులు గొప్పగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపేసుకున్నారు. పేద ప్రజలకు తాము ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు షీలాదేవి కుటుంబ సభ్యులకు ఆ పథకాలు అందించడంలో ఎందుకు విఫలం అయ్యారు ? అనే ప్రశ్నలకు అధికారులు పొంతనలేని లక్ష సమాధానాలు చెబుతున్నారని స్థానిక మీడియా విమర్శిస్తోంది.