Lockdown: లాక్ డౌన్ లక్కీచాన్స్, ఏటీఎంల్లోని రూ. 1 కోటితో పరారైన ఉద్యోగి, గంటకు రూ. 10 లక్షలు !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ సందర్బంగా ఓ వ్యక్తి చిక్కింది లక్కీచాన్స్ అంటూ కోటి రూపాయలతో ఎస్కేప్ అయ్యాడు. ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యడానికి రూ. 4. 50 కోట్ల నగదు డ్రా చేసిన ఓ సంస్థ ఉద్యోగి అందులో ఏకంగా రూ. 1 కోటితో పరారైనాడు. కోటి రూపయలకు ఒక గంటలో రూ. 10 లక్షలు వడ్డీ వస్తుందని ఆశపడ్డాడు. ఏటీఎంలో రూ. 3. 50 కోట్లు మాత్రమే నిల్వ చేశారని, మిగిలిన రూ. 1 కోటి మాయం అయ్యిందని గుర్తించిన ఆ సంస్థ యాజమాన్యం షాక్ కు గురై పోలీసులను ఆశ్రయించింది. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీలో చిక్కింది లాక్ డౌన్ చాన్స్ అంటూ ఓ ఉద్యోగి కోటి రూపాయలతో మాయం అయ్యాడు.
Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !
ఏటీఎంలో నగదు డిపాజిట్
బెంగళూరు నగరంలో సెక్యూర్ వ్యాల్యూ అనే సంస్థ బ్యాంకుల ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వ చేస్తున్నది. సెక్యూర్ వ్యాల్యూ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్న కొందరు సిబ్బంది ఏ ప్రాంతంలో ఉన్న ఏటీఎం కేంద్రాల్లో ఎంత డబ్బులు నిల్వ చెయ్యాలి ?, బ్యాంకుల్లో ఎంత డబ్బులు డ్రా చెయ్యాలి ? అనే లెక్కలు ప్రతిరోజు చూస్తుంటారు.
ఎస్ బీఐ బ్యాంకులో రూ. 4. 50 కోట్లు డ్రా
బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ మార్క్స్ రోడ్డులోని ఎస్ బీఐ మెయిన్ బ్రాంచ్ లోకి సెక్యూర్ వ్యాల్యూ ఉద్యోగులు అశోక్, రాము, శ్రీనివాస్ వెళ్లారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వ చెయ్యడానికి మొత్తం రూ. 4. 50 కోట్ల నగదు డ్రా చెయ్యవలసి ఉంది. అయితే అక్కడే గోల్ మాల్ చెయ్యడానికి ఓ ఉద్యోగికి లక్కీచాన్స్ చిక్కింది.
అశోక్ మాస్టర్ ప్లాన్
మే 14వ తేదీన సెయింట్ మార్క్స్ రోడ్డులోని ఎస్ బీఐ బ్యాంకులో మొదట రూ. 3. 50 కోట్లు డ్రా చేసిన అశోక్ ఆ డబ్బును రాము, శ్రీనివాస్ కు ఇచ్చి ఏటీఎం కేంద్రాల్లో ఆ డబ్బు నిల్వ చెయ్యాలని చెప్పాడు. రాము, శ్రీనివాస్ రూ. 3. 50 కోట్ల డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వ్యాన్ లో వెళ్లిపోయారు. తరువాత అశోక్ బ్యాంకులో రూ. 1 కోటి డ్రా చేసుకుని బ్యాగులో సర్దుకున్నాడు.
రూ. 1 కోటి ఎలా మాయం అయ్యింది ?
ఏటీఎం కేంద్రాల్లో నిల్వ చేసిన డబ్బులో రూ. 1 కోటి డబ్బులు లేవని, ఏదో తేడా వచ్చిందని బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే ఏటీఎం కేంద్రాల్లో ఎవరెవరు ఎంతెంత డబ్బులు డ్రా చేశారు అని ఆరా తీశారు. ఏటీఎం కేంద్రాల్లో రూ. 3. 50 కోట్లు మాత్రమే డిపాజిట్ అయ్యిందని, మరో కోటి రూపాయలు మాయం అయ్యిందని గుర్తించిన బ్యాంకు సిబ్బంది సెక్యూర్ వ్యాల్యూ సంస్థకు సమాచారం ఇచ్చారు. సెక్యూర్ వ్యాల్యూ సంస్థ ఫిర్యాదు చెయ్యడంతో కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.
దేవుడా....ఒక గంటకు రూ. 10 లక్షలు వడ్డి !
సంతోష్ అనే వ్యక్తి తనకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తే వంద రూపాయలకు గంటకు రూ. 10 వడ్డి ( 10% వడ్డి) ఇస్తానని అశోక్ కు మాయమాటలు చెప్పాడు. 1 కోటి రూపాయలు కొన్ని గంటలు ఆలస్యంగా ఏటీఎంలో డిపాజిట్ చేస్తే కొంపలు మునిగిపోవని, తనకు రూ. లక్షల్లో వడ్డి వస్తుందని ఆశపడిన అశోక్ రూ. 1 కోటి డబ్బులు సంతోష్ కు ఇచ్చాడు. అయితే సంతోష్ చేతులు ఎత్తేయడంతో అయోమయానికి గురైన అశోక్ మాయం అయ్యాడని కబ్బన్ పార్క్ విచారణలో వెలుగు చూసింది.
Recommended Video
అత్యాశకు పోతే ఇదే గతి
సంతోష్ ను అరెస్టు చేసిన కబ్బన్ పార్క్ పోలీసులు అతనికి సహాయం చేసిన అశోక్ తో పాటు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కోటి రూపాయలకు గంటకు రూ. 10 లక్షలు వడ్డి ఇస్తామంటే గంటల్లో భారీ మొత్తంలో నగదు వస్తుందనే అత్యాశ కోసం కంపెనీ ఉద్యోగి అశోక్ ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యవలసిన రూ. 1 కోటి మాయం చేశాడని తెలుసుకున్న సాటి ఉద్యోగులు షాక్ కు గురైనారు. అత్యాశకు పోయిన అశోక్ ఉద్యోగం ఊడిపోవడమే కాకుండా అతని మీద కేసు నమోదు అయ్యింది.