లాక్డౌన్ దారుణం.. పోలీసుల దెబ్బలకు వ్యక్తి మృతి.. కూతురికి పాల కోసం బయటికెళ్లగా..
ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజాసంక్షేమం కోసమే లాక్డౌన్కు పిలుపిచ్చామన్న ప్రభుత్వాలు.. పోలీసుల ద్వారా ఆదేశాలు అమలు చేయిస్తున్నాయి. చాలా వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమైపోగా, కొందరు మాత్రం యధేచ్ఛగా రోడ్లపై సంచరిస్తుండటంతో పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. పౌరుల్ని పోలీసులు ఇష్టారీతిగా కొట్టడాన్ని చట్టం సమర్థించనప్పటికీ.. కరోనా భయాల నేపథ్యంలో మెజార్టీ సమాజం ఖాకీల చర్యను తప్పుపట్టడంలేదు. అయితే ఈక్రమంలో కొందరు అమాయకులు బలవుతుండటం విషాదకర పరిణామం.
పాల కోసం వెళ్లి..
లాక్డౌన్ వేళ దాదాపు దుకాణాలన్నీ మూతపడటంతో కూతురికి పాల కోసం రోడ్డెక్కిన ఓ వ్యక్తిని.. పోలీసులు వెంటాడిమరీ విపరీతంగా కొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా సిటీ హౌరా ప్రాంతంలో చోటుచేసుకుందీ ఘటన. స్థానికంగా నివసించే లాల్ స్వామి(32) అనే వ్యక్తి తన కూతురికి కావాల్సిన పాల కోసం బయటికి వెళ్లగా వెళ్లి పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. పైకి కనిపించని గాయాలతో బాధపడుతూ ఎలాగోలా ఇంటి దాకా వెళ్లినా.. గుమ్మంలోనే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు అతణ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
పోలీసులు ఏమన్నారంటే..
లాల్ స్వామి మృతితో బుధవారం హౌరా ఏరియాలో చిన్నపాటి అలజడరేగింది. పోలీసుల దూకుడును నిరసిస్తూ జనం రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ బలగాలు వారిని అడ్డుకున్నాయి. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో హౌరా పోలీసులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. స్వామిని కొట్టలేదని చెబుతూనే.. అతని మృతికి లాఠీ దెబ్బలు కారణం కాదని, గుండె జబ్బు వల్లే అతను చనిపోయాడని పోలీసులు వాదిస్తున్నారు. మృతుడి బంధువులు మాత్రం పోలీసులపై కేసు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
బెంగాల్ సీన్ ఇది..
దేశంలోని మిగతా పెద్ద రాష్ట్రాలతో పోల్చుకుంటే వెస్ట్ బెంగాల్ లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉంది. గురువారం నాటికి రాష్ట్రలో మొత్తం 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడం కంటే ముందే సీఎం మమత మార్చి 31 వరకు నిషేధం ఆదేశాలు జీరీచేశారు.
Recommended Video
ఆగని మరణాలు..
దేశవ్యాప్తంగా గురువారం ఉదయం 11 గంటల నాటికి కరోనా మరణాల సంఖ్య 15కు పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య 649కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 21,297కాగా, పాజిటివ్ కేసులు 4.71లక్షలకు పెరిగింది. అదే సమయంలో వైరస్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 1.14 లక్షలుగా ఉంది.