దే వు డా..! ఆకలి తట్టుకోలేక కప్పలను తింటున్న చిన్నారులు..! బీహార్ లో చిత్రమైన పరిస్థితి..!!
పాట్నా/హైదరాబాద్ : ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు అతికినట్టు సరిపోతోంది. కరోనా మహమ్మారిని అంతం చేసే క్రమంలో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేస్తూ ప్రజలందరిని ఇళ్లకే పరిమితం చేసింది భారత సర్కార్. ఈ నేపథ్యంలో రెక్కాడితే గానీ డొక్కాడని కడు పేద ప్రజలకు కేంద్రం బాసటగా ఉంటుంన్నప్పటికి క్షేత్ర స్ధాయిలో కొన్ని సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ఇదే పరంపరలో బీహార్ రాష్ట్రంలోని కొన్ని వెనకబడిన ప్రాంతాల్లో కొంత మంది పేద ప్రజలు తిండిలేక, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు పొందలేక దయనీయ పరిస్థితులను వెళ్లదీస్తున్నట్టు తెలుస్తోంది.
దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ ఆంక్షలు.. మారుమూల గ్రామాల్లో తిండిదొరకడం కష్టమే..
దేశంలో కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండేందుకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. దేశ ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. దేశ పౌరులందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది కేంద్రం. అంతే కాకుండా కనిపించని ప్రాణాంతక వైరస్ నుంచి దేశాన్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి కొన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులకు తప్పట్లేదని కొన్ని హృదయ విదారక సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
నిరుపేదల పరిస్థితి అగమ్య గోచరమే.. ఆకలికి అలమటిస్తున్న వలస కూలీలు..
కరోనా క్లిష్ట సమయంలో తిండిలేని నిరుపేదలకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నాయి కొన్ని స్వచ్చంద సంస్థలు. మరికొంత మంది తమ సొంత ఖర్చులతో నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు భోజన సదుపాయాన్ని కూడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒక మారు మూలన కొంత మంది ఆకలితో అలమటిస్తున్నట్టు తెలుస్తోంది. బీహార్ లోని ఓ మారుమూల ప్రాంతంలో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకొంది. ఆకలికి తట్టుకోలేక కొంత మంది చిన్న పిల్లలు కప్పలను తింటున్నట్టు తెలుస్తోంది.
బీహార్ లో వింత సంఘటన.. ఆకలి తీర్చుకోవడానికి చిన్న పిల్లల వెతలు..
పట్టెడు కూడు పెట్టే మనిషి లేక, ఆకలిని తట్టుకోలేక కొంతమంది చిన్నారులు కప్పలను ఆహారంగా సేవిస్తున్నారు. హృదయాలను కలిచివేసే ఈ ఘటన బీహార్లో ఆలస్యంగా వెలుగు చూసింది. లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో కొంతమంది వలస కార్మికులకు, నిరు పేద ప్రజలకు పూట గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో బీహార్ లోని జెహనాబాద్కు చెందిన కొందరు చిన్నారులు ఆకలితో అల్లాడిపోయిట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో వారికి ఐదు రోజులుగా ఆహారం దొరక్కపోవడంతో కప్పలను తింటూ బ్రతుకు వెళ్లదీస్తున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
ఆకలి తీర్చుకోవడానికి చిన్నారుల కఫ్టాలు.. కప్పలను తింటూ కాలం వెళ్లదీస్తున్న పసివాళ్లు..
మురుగు కాలువలో ఉన్న కప్పలను వేటాడి తినకపోతే వారికి జీవన్మరణ సమస్య ఎదురౌతుంది. సమయానికి పట్టెడు మెతుకులు దొరకని పరిస్థితిలో కప్పలే వారి ప్రాణాలు కాపాడే ఆహారండా మారాయి. ఇది గమనించిన కొందు ఎందుకు కప్పలను తింటున్నారని ఆ చిన్నారులను ప్రశ్నించగా దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు ఆ చిన్నారులు. ఐదు రోజులుగా భోజనం లేదని, ఇంట్లో వండటానికి కయూడా ఏమి లేవని, ప్రస్తుతం ఆహారం దొరకక ఇలా కప్పలను తింటున్నట్టు వారి దీన గాథను చెప్పుకొచ్చారు. ఐతే ఇదే అంశం పట్ల సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్ నవీన్ కుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.