లాక్డౌన్ ఎఫెక్ట్: అమెరికాలో ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో! ఎన్నారైల ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో విధించిన లాక్డౌన్ కారణంగా కరోనావైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, లాక్డౌన్ కారణంగా ప్రాణాంతక వైరస్ను కట్టడి చేస్తున్నప్పటికీ.. ప్రజలు ముఖ్యంగా మనదేశానికి వచ్చిన ప్రవాస భారతీయులు తీవ్ర మానిసక వేదనకు గురవుతున్నారు.
ప్రవాసుల్లో మానసిక ఆందోళనలు
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మే 3 వరకు కేంద్రం పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, అమెరికాతోపాటు వివిధ దేశాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ప్రవాసులు కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో స్వదేశానికి తిరిగివచ్చారు. అయితే, ఆయా దేశాల్లో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో పలు సంస్థలు, కంపెనీలు తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉద్యోగాలు చేసే ప్రవాసులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉండటంతో స్వదేశానికి తిరిగివచ్చిన వారు ఆయా దేశాలకు వెళ్లలేకపోతున్నారు. దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయోననే మానసిక ఆందోళనకు గురవుతున్నారు ప్రవాస భారతీయులు.
కుటుంబాలు.. వీసా గురించిన ఆందోళనలు
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు కూడా భారీ సంఖ్యలోనే మనదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు. కొందరు తమ కుటుంబసభ్యులు అమెరికా లేదా ఇతర దేశాల్లో ఉండటంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. ఓవైపు తమ ఉద్యోగాలను కాపాడుకోవడం, మరోవైపు తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరికొందరి వీసా గడువు పూర్తవుతుండటంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు.
Recommended Video
ఎన్నారైల ఆవేదన..
తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్ తోపాటు ఇతర నగరాలకు చెందిన ఎన్నారైలు తమ ఉద్యోగాలు కాపాడుకోవాలంటే ఇప్పుడు అమెరికాకు వెళ్లాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 23, ఏప్రిల్ 5 ఇలా కొన్ని తేదీలు ఇచ్చారని.. ఆ తేదీల్లో తాము వెళ్లలేకపోయామని.. దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితి దృష్ట్యా పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించగా, మరికొన్ని ఆలస్యంగా చేరేందుకు అనుమతిస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో పనిచేసే వారికి ఊరట లభించింది కానీ, మరికొన్ని సంస్థల్లో పనిచేసేవారికి ఇలాంటి అవకాశం లేకపోవడంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. మే 3తో లాక్ డౌన్ ముగిస్తే తమ ఉద్యోగాల్లో చేరిపోతామంటున్నారు.