లాక్ డౌన్ ఎఫెక్ట్ .. వాహన డాక్యుమెంట్ల రెన్యువల్ కు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం
కరోనా ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కాయలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే సమయంలో వాహనదారులు సైతం రోడ్ల మీదకు రాకుండా ఆంక్షలు విధించారు . ఇక ఈ క్రమంలో అన్ని డాక్యుమెంట్లు ఉన్నా వాహనదారులు బయటకు రావాలంటే పోలీసుల దెబ్బకు భయపడుతున్న పరిస్థితి .ఇక డ్రైవింగ్ లైసెన్స్ , ఆర్సీ లకు కాలం చెల్లిన వాళ్ళ పరిస్థితి అయితే మరింత దారుణం . ఇక అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం .
పని చెయ్యని ఆర్టీఏ ఆఫీసులు .. నిలిచిపోయిన రెన్యువల్స్
ఇక తాజాగా లాక్ డౌన్ నేపధ్యంలో ఆర్టీఏ ఆఫీసులు సైతం పని చెయ్యటం లేదు. దీంతో రెన్యువల్స్ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం వాహనదారులు రూల్స్ అతిక్రమిస్తే.. పోలీసులు ఏ రేంజ్ ఫైన్లు వేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అసలే బయటకు రావద్దంటే ఇక డ్రైవింగ్ లైసెన్స్ కాల పరిమితి అయిపోయిన వాళ్ళు బయటకు వస్తే ఇక వారికి చుక్కలే . అందుకే ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ కాలం చెల్లినవాళ్లు రవాణాశాఖ ఆఫీసులకు వెళ్లినా ‘కరోనా' లాక్ డౌన్ నేపధ్యంలో వారి డాక్యుమెంట్లు రెన్యువల్ కాని పరిస్థితి .
ఫిబ్రవరి 1 తర్వాత కాలం చెల్లిన వాహనాల డాక్యుమెంట్ల విషయంలో కేంద్రం నిర్ణయం
లాక్డౌన్ సమయంలో ఇలాంటి సమస్యలతో ఇబ్బందిపడేవారికి స్వాంతన చేకూరుస్తూ చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1 తర్వాత కాలం చెల్లిన అన్ని వాహనాల డాక్యుమెంట్లు జూన్ 30 వరకు రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో కాలం చెల్లిన డాక్యుమెంట్లు ఉన్నా బయట వారి నిత్యావసరాలకు వాహనం తీసుకువెళ్ళే వెసులుబాటు కలుగుతుంది . ఈ నిర్ణయంతో సరకు రవాణా, నిత్యావసరాలు తరలించే వెహికల్స్ కు రోడ్లపై ఆటంకాలు తొలగిపోనున్నాయి. ఇక రెన్యువల్ చేయించుకోలేని పరిస్థితిలో వారు పోలీసులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పడనుంది .
రవాణా శాఖకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
దీనికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని రవాణాశాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఫిబ్రవరి తర్వాత కాలం చెల్లిన డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకొని.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని సూచించింది. మోటార్ వాహనాల చట్టం కిందకు వచ్చే డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, అన్నిరకాలు పర్మిట్ లు,రిజిస్ట్రేషన్లు సహా అన్ని డాక్యుమెంట్లకు ఇవే మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది కేంద్ర సర్కార్ .