ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు .. మరికాసేపట్లో కేంద్రం కీలక ప్రకటన !!
ప్రధాని నరేంద్రమోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో లాక్ డౌన్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించాలి అని మెజార్జీ ముఖ్యమంత్రుల అభిప్రాయంతో ప్రధాని ఏకీభవించినట్టు సమాచారం . కరోనా కట్టడి కోసం కొనసాగుతున్న లాక్ డౌన్ మరి కొద్ది రోజులు కొనసాగితే మెరుగైన ఫలితం వస్తుందని , ప్రాణనష్టం జరగకుండా ఉంటుందని పలువురు మఖ్యమంత్రులు ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారు . దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలని ఏకాభిప్రాయం రావడంతో లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. పలు రాష్ట్రాల సీఎంలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధాని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే, పరిశ్రమలకు ,వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వాలని కోరిన నేపధ్యంలో వాటికి మాత్రం మినహాయింపు ఇస్తూ అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు . ఇక ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు వేగంగా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ పంపాలని ప్రధానిని కోరారు.
కరోనా అనుమానితులను జల్లెడ పట్టి వారికి టెస్టులు నిర్వహించి మొత్తం కరోనా బాధితులను గుర్తించి వైద్యం చెయ్యాలని భావిస్తున్నట్టు రాష్ట్రాలు ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారు. ఇప్పటికే ఊరూరు జల్లెడ పడుతున్నట్టు ప్రధానికి తెలియజేశారు . మరికొద్ది రోజులు కొనసాగిస్తే కరోనా వ్యాప్తి జరగదని ప్రధానికి తేల్చి చెప్పారు. దీంతో ఈ నెల మొత్తం లాక్ డౌన్ కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, లాక్ డౌన్ పొడిగింపుపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ఇవాళ ప్రధాని మోడీ దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వుంది.