బెంగళూరులో విచిత్రం: వికటించిన ప్రయోగం: ఆ వారంలోనే వేలకొద్దీ కేసులు: షాకింగ్ రిజల్ట్స్
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దశలవారీగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించింది కేంద్ర ప్రభుత్వం. మూడు దశల వరకూ కఠినంగా లాక్డౌన్ను అమలు చేసింది. ఆ తరువాత దశలవారీగా సడలింపులకు అనుమతులు ఇస్తూ వచ్చింది. లాక్డౌన్ సమయంలో అదుపులో ఉన్నట్టుగా కనిపించిన కరోనా వైరస్ విజృంభణ.. సడలింపుల తరువాత ఆకాశమే హద్దుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రోజూ వేల కొద్దీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలూ దీనికి మినహాయింపు కాదు.
స్పీకర్కు షాక్: హైకోర్టు ఆదేశాలపై స్టేకి సుప్రీం నో: అంతమాత్రానికే ఎమ్మెల్యేల అనర్హతా?
షాకింగ్ రిజల్ట్స్
ఈ పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా లాక్డౌన్ను విధిస్తున్నాయి ప్రభుత్వాలు. వందల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతోన్న జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. కొన్ని చోట్ల పాజిటివ్ కేసులు అదుపులోకి రాగా.. మరి కొన్ని చోట్ల దారుణంగా విఫలం అవుతున్నాయి. ఈ జాబితాలో సిలికాన్ సిటీ బెంగళూరు టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. బెంగళూరులో ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొనసాగిన వారం రోజుల లాక్డౌన్ చేదు దిగ్భ్రాంతిని కలిగించే ఫలితాలను ఇచ్చింది. లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తోన్న సమయంలోనే అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
సాధారణ రోజుల కంటే..
లాక్డౌన్ విధించిన ఈ వారం రోజుల వ్యవధిలో బెంగళూరులో 13,972 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే.. ఈ సంఖ్య 45 శాతం అధికం కావడం అధికార వర్గాలను ఆందోళనల్లోకి నెట్టేసింది. లాక్డౌన్ విధించడానికి ముందు అంటే 14వ తేదీ వరకు 9,608 కేసులు రికార్డు అయ్యాయి. 14వ తేదీ రాత్రి 8 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. 15వ తేదీ నుంచి 22 వరకు ఏకంగా 13,972 కేసులు వెలుగులోకి వచ్చాయి. 16వ ఒక్కరోజే 2,344 కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలోనూ కేసుల్లో పెరుగుదల కనిపించింది.
ఇతర నగరాలతో పోల్చుకుంటే..
ముంబై, చెన్నై, ఢిల్లీల్లో లాక్డౌన్ లేని రోజుల్లో నమోదైన పాజిటివ్ కేసులను మించి బెంగళూరులో లాక్డౌన్ సమయంలో నమోదు అయ్యాయి. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు ఢిల్లీ-1.08, ముంబై-1.09, చెన్నై-1.11 శాతం కరోనా కేసులు నమోదు కాగా.. బెంగళూరులో లాక్డౌన్ విధించానప్పటికీ.. 1.67 శాతం మేర పాజిటివ్స్ వెలుగులోకి వచ్చాయి. కఠినంగా లాక్డౌన్ను అమలు చేసినా.. పాజిటివ్ కేసుల సంఖ్య ఎలా పెరిగిందనేది అంతుచిక్కట్లేదని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
Recommended Video
మరణాల రేటూ అధికమే..
లాక్డౌన్ సమయంలో బెంగళూరులో నమోదైన మరణాల రేటు కూడా అధికంగా నమోదైంది. ఈ నెల 8 నుంచి 14 వరకు అంటే లాక్డౌన్ లేని రోజుల్లో ఉద్యాననగరిలో రోజూ సగటున 32 మంది కరోనా బారిన పడి మరణించారు. అదే లాక్డౌన్ విధించిన కాలంలో అంటే ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు 49 మంది మృత్యువాత పడ్డారు. మరణాల రేటు 2.31 నుంచి 2.45కు పెరిగింది. ఈ తరహా పరిస్థితులు ఏర్పడటం వల్లేనేమో.. లాక్డౌన్ను కొనసాగించడానికి వెనుకంజ వేసింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరులో ఈ నెల 30 వరకూ లాక్డౌన్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అది సాధ్యపడలేదు.