20 తరువాత పూర్తిస్థాయిలో బ్యాంకుల కార్యకలాపాలు:. ఏటీఎంలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన రెండోదశ లాక్డౌన్ను ఈ నెల 20వ తేదీ తరువాత కొద్దిగా సడలించబోతోంది కేంద్ర ప్రభుత్వం. సడలింపు అనంతరం ఆయా రాష్ట్రాలు అనుసరించాల్సిన విధానాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
లాక్డౌన్ సందర్భంగా పూర్తిగా స్తంభించిపోయిన ఆర్థిక రంగాన్ని మెరుగుపర్చే ప్రయత్నం చేసింది కేంద్రం. ఇందులో భాగంగా.. బ్యాంకులు ఇకపై పూర్తిస్థాయిలో పని చేస్తాయని వెల్లడించింది. రిజర్వు బ్యాంకు పరిధిలో ఉండే అన్ని బ్యాంకులు, ఏటీఎంలు, ఐటీ వెండార్స్ వంటివి పూర్తిస్థాయిలో కార్యకాలాపాలను కొనసాగించడానికి వీలు కల్పించింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం.. రిజర్వు బ్యాంకుతో పాటు దాని పర్యవేక్షణలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్న బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో కార్యకలాపాలు ఈ నెల 20వ తేదీన పునరుద్ధరిస్తారు. నేషనల్ పేవ్మెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), సిస్టమ్ ఆపరేటర్స్, స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
Recommended Video
దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల శాఖా కార్యాలయాలు ఏటీఎంలు తెరచుకుంటాయి. పూర్తిస్థాయిలో లావాదేవీలను నిర్వహిస్తాయి. ఐటీ వెండార్స్, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్, ఏటీఎం ఆపరేషన్స్, క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలను ఈ జాబితాలో చేర్చింది.
డీబీటీ క్యాష్ ట్రాన్స్ఫర్ పంపిణీ పూర్తయ్యే వరకు కూడా అన్ని బ్యాంకుల శాఖా కార్యాలయాలు నిర్దేశిత సమయ పాలనను అనుసరించాల్సి ఉంటుందని కేంద్రం తన మార్గర్శకాల్లో స్పష్టం చేసింది. శాఖా కార్యాలయాల్లో సోషల్ డిస్టెన్సింగ్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని వెల్లడించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), క్యాపిటల్, షేర్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్ఛేంజీలు తెరచుకుంటాయి. ఐఆర్డీఏఐ, ఎల్ఐసీ వంటి బీమా రంగ కంపెనీల సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది.