గ్రామాలకు ఊతం: 20 తరువాత జోరుగా వ్యవసాయ పనులు: తెరచుకోనున్న పరిశ్రమలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా రెండోదశ లాక్డౌన్ను ప్రకటించిన వేళ.. దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ను పాక్షికంగా ఎత్తేస్తున్నట్లు మంగళవారం నాడు తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటంచిన నేపథ్యంలో.. మరుసటి రోజే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను వెల్లడించింది.
రాష్ట్రాల మధ్య రన్నింగ్ రేస్: 20 తరువాత లాక్డౌన్ సడలింపుపై నిబంధనలు..కాస్సేపట్లో:
వ్యవసాయం.. పరిశ్రమలకు
గ్రామీణ భారతానికి ప్రాముఖ్యత ఇచ్చింది కేంద్రం. వ్యవసాయ పనులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లకు ఊతం ఇచ్చేలా వాటిని రూపొందించింది. ఈ నెల 20వ తేదీ తరువాత వ్యవసాయ పనులు జోరుగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం తప్పనిసరి అంటూ కేంద్రం హెచ్చరించింది. దీనికి సంబంధించిన సూచలను ఈ తాజా మార్గదర్శకాల్లో పొందుపరిచింది.
వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించేలా..
ఇప్పటికే 21వ రోజుల పాటు లాక్డౌన్ను అమలు చేయడం వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. వ్యవసాయ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చేతికి వచ్చిన పంటను కూడా ఇంటికి తెచ్చుకోలేని దుస్థితిని ఎదుర్కొన్నారు రైతులు. వ్యవసాయ కూలీలు దొరక్కపోవడం, వ్యవసాయోత్పత్తుల రవాణా స్తంభించడం వల్ల ఈ రంగంలో ఒడిదుడుకులు నెలకొన్నాయి. దీన్ని నివారించడానికి కేంద్రం దృష్టి సారించినట్టయింది.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పునరుద్ధరణ..
19 రోజుల లాక్డౌన్ రెండోదశలో వ్యవసాయరంగంతో పాటు పరిశ్రమలను పునరుద్ధరించుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ తరువాత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పునఃప్రారంభం కావడానికి వెసలుబాటును కల్పించింది. గ్రామీణ పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మందుల తయారీ వంటి రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. వ్యవసాయోత్పత్తుల రవాణాకు క్లియరెన్స్ ఇచ్చింది.
రెడ్జోన్లు, హాట్ స్పాట్లలో యధాతథంగా..
కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా.. ఆయా కార్యకలాపాలన్నింటినీ నిర్వహించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఆయా రంగాలకు సంబంధించిన క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణలో ఆయా పనులు కొనసాగించల్సి ఉంటుందని వెల్లడించింది. ఆయా కార్యకలాపాలన్నీ కంటైన్మెంట్ జోన్లు, రెడ్జోన్లు, హాట్ స్పాట్లకు మాత్రం వర్తింపజేయలేదు. వైరస్ తీవ్రత తగ్గిన తరువాతే.. ఆయా ప్రాంతాల్లోనూ వాటిని చేపట్టడానికి అనుమతి ఇస్తారు.
Recommended Video