Lockdown: ఆన్ లైన్ పాఠాలు, ఆవును అమ్మి పిల్లలకు స్మార్ట్ ఫోన్, ఎమ్మెల్యేకి రూ. 6 వేలు దిక్కు లేదు!
సిమ్లా/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలుకావడంతో పేదలు, సామాన్య ప్రజల జీవితాలు చెల్లాచెదురైనాయి. ఇలాంటి సమయంలో కుటుంబాన్ని పోషించడం వీలుకాక ఇప్పటికే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సమస్యలతో పాటు ఇప్పుడు పిల్లల ఆన్ లైన్ పాఠాలు కొందరు తల్లిదండ్రులకు మరోసమస్యగా తయారైయ్యింది. పిల్లలు బాగా చదువుకోవాలని, ఆన్ లైన్ పాఠాలు వినడానికి వారికి స్మార్ట్ ఫోన్ అవసరం అని భావించిన ఓ ఇంటి యజమాని కుటుంబాన్ని పోషిస్తున్న ఆవును విక్రయించారు. ఆవును విక్రయించిన సొమ్ముతో పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.
Love Marriage: సూర్యకాంతం ఎంట్రీతో ట్విస్ట్, రెండో పెళ్లి ఇష్టం లేక భార్య, విరక్తితో భర్త, నీ కులం!
ఫ్యామిలీకి ఆవు ఆధారం
హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి జిల్లాలోని గుమ్మార్ గ్రామంలో కులదీప్ కుమార్, ఆయన భార్య, అన్షు, డిప్పు అనే ఇద్దరు పిల్లలతో కలిసి మట్టితో నిర్మించి చాలా చిన్న ఇంటిలో భార్య, పిల్లలతో కలిసి కులదీప్ కుమార్ జీవిస్తున్నాడు. కులదీప్ కుమార్ కూలిపనులు చేస్తున్నాడు. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ అమలు కావడంతో ఆ కారణంగా కూలిపనులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కులదీప్ కుమార్ ఇంట్లో ఓ ఆవు ఉంది. ఇంట్లో ప్రతిరోజు ఆవు ఇచ్చే పాలు విక్రయించి వచ్చిన సొమ్ముతో కులదీప్ కుమార్ అతని కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
పిల్లలు బాగా చదవాలి !
కులదీప్ కుమార్ కుమార్తె అన్షు నాలుగో తరగతి, డిప్పు రెండో తరగతి చదువుతున్నారు. తనలాగా తన పిల్లలు కూలి పనులు చేసి జీవించకూడదని, బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చెయ్యాలని కులదీప్ కుమార్ దంపతులు బావించారు. లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. లాక్ డౌన్ దెబ్బతో గత నాలుగు నెలల నుంచి కులదీప్ కుమార్ ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు.
పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు
ఇంట్లో ఉంటున్న పిల్లలకు ఆన్ లైన్ లో పాఠాలు చెబుతామని ఇద్దరు పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యం కులదీప్ కుమార్ కు సమాచారం ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ లేకపోతే తాము ఆన్ లైన్ లో మీ పిల్లలకు పాఠాలు చెప్పడం వీలుకాదని స్కూల్ టీచర్లు చెప్పారు. పిల్లల ఆన్ లైన్ లో పాఠాలు నేర్చుకోవడానికి స్మార్ట్ ఫోన్ కావాలని తెలుసుకున్న కులదీప్ కుమార్ ఫోన్ కొనుగోలు చెయ్యడానికి చేతిలో డబ్బులు లేవని ఆవేదన చెందాడు. లాక్ డౌన్ దెబ్బకు కనీసం రూ. 500 అప్పు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. బయట ఎక్కడా అప్పు చిక్కకపోవడంతో బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకుని పిల్లల కోసం ఓ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలని నిర్ణయించాడు.
వేరేదారిలేక ఆవు అమ్మేశాడు
రుణం తీసుకోవాలని కులదీప్ కుమార్ అనేక బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ప్రస్తుత ఆర్థిక సమస్యల కారణంగా తాము మీకు వ్యక్తిగత రుణం ఇవ్వలేమని బ్యాంకు అధికారులు కులదీప్ కుమార్ కు చెప్పారు. బ్యాంకులు రుణం మంజూరు చెయ్యకపోవడంతో వేరేదారిలేక ఇంట్లో తమను పెంచిపోషిస్తున్న ఆవును కులదీప్ కుమార్ వేరే వ్యక్తికి రూ. 6, 000 అమ్మేశాడు. రూ. 6 వేలతో పాటు అతని దగ్గర ఉన్న కొంత సొమ్ము కలిపి ఓ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన కులదీప్ కుమార్ తన పిల్లలు ఆన్ లైన్ పాఠాలు నేర్చుకోమని చెప్పి వారికి ఇచ్చాడు.
ఎమ్మెల్యేకు విషయం తెలిసి ఉచిత సలహా!
కులదీప్ కుమార్ కు రేషన్ కార్డు (BPL) కార్డు కూడాలేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలలో కూడా కులదీప్ కుమార్ కు మొండిచెయ్యి మిగిలింది. ఆవును అమ్మి పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం కులదీప్ కుమార్ మొబైల్ కొనుగోలు చేశాడని జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ ధవాలాకు తెలిసింది. కుటుంబాన్ని పోషిస్తున్న ఆవును పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం అమ్మేసిన కులదీప్ కుమార్ కు వెంటనే సహాయం చెయ్యాలని బిడిఓ, ఆ గ్రామం ఎస్ డీఓకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎమ్మెల్యే అధికారులకు ఉచిత సలహా ఇచ్చారు కాని ఆ ఎమ్మెల్యే అనుకుంటే ఆరు వేల రూపాయలకు కొదవా ? ఆయనే సొంత డబ్బుతో అమ్మిన ఆవును కొని మళ్లీ కులదీప్ కుమార్ కు ఇవ్వాలి కదా ? అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.