కరోనా : కర్ణాటకలో 14 రోజులు సంపూర్ణ లాక్డౌన్... వలస కార్మికులకు సీఎం కీలక విజ్ఞప్తి..
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 25 వరకు రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. మే 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అమలులోకి రానున్న లాక్డౌన్ మే 25వ తేదీ ఉదయం 6గంటల వరకు కొనసాగుతుంది. లాక్డౌన్ పీరియడ్లో అత్యవసర సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి.
ఇది తాత్కాలిక లాక్డౌన్ మాత్రమేనని... కాబట్టి వలస కార్మికులు నగరాన్ని వీడవద్దని ముఖ్యమంత్రి యడియూరప్ప విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ సమయంలో ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు యడియూరప్ప తెలిపారు. కరోనా కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
'కర్ణాటకలో శుక్రవారం(మే 7) ఒక్కరోజే 592 మంది కరోనా బారినపడి మృతి చెందారు.దీన్నిబట్టి కర్ఫ్యూ ఆంక్షలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వట్లేదని స్పష్టమవుతోంది. కాబట్టి కరోనా వ్యాప్తి చెందిన కొత్తలో విధించినట్లే ఇప్పుడు కూడా లాక్డౌన్ అవసరమని భావిస్తున్నాం. ఇందులో భాగంగా 14 రోజుల లాక్డౌన్ విధించాం.' అని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డా.కె.సుధాకర్ తెలిపారు.
గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో కొత్తగా 48,781 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 592 మంది కరోనాతో మృతి చెందగా... ఇందులో ఒక్క బెంగళూరులోనే 346 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,36,641 కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,83,885కి చేరింది.
ప్రస్తుతం కర్ణాటకకు కేంద్రం నుంచి రోజుకు 962 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందుతోంది. అయితే ఇప్పుడున్న అవసరాలకు అది సరిపోకపోవడంతో దాన్ని 1200 మెట్రిక్ టన్నులకు పెంచాలని హైకోర్టు గురువారం(మే 6) కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించడం గమనార్హం.