ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం: ఏప్రిల్ 30 వరకు బుకింగ్స్ రద్దు
న్యూఢిల్లీ: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగించాలని కోరుతున్నాయి. అయితే, కేంద్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. కాగా, భారతీయ రైల్వే శాఖ అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ఐర్సీటీసీ ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. 582కాగా, ఐఆర్సీటీసీ తాజా నిర్ణయంతో ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించే ఉద్దేశంలో ఉందనే ప్రచారం జరుగుతోంది.
కాగా, దేశ వ్యాప్తంగా దాదాపు 4500 మందికి కరోనా సోకగా, గడిచిన 24గంటల్లో 350 మందికి కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనావైరస్ కట్టడి కోసం లాక్డౌన్ను దేశ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతుండగా, మరికొన్ని రాష్ట్రాలు పాక్షికంగా సడలింపు చేపట్టాలని నిర్ణయిస్తున్నాయి.
లాక్డౌన్ను పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నాయనీ.. వారి ప్రతిపాదనలపై ఆలోచిస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ పొడిగింపుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ పేదలను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని, దానిపైనే ప్రత్యేక దృష్టి సారించారని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష మందికిపైగా కరోనా పరీక్షలు చేయించామని చెప్పారు. అలాగే, కరోనా చికిత్స కోసం ఆస్పత్రులను రెండు విధాలుగా విభజించామని, కరోనా తీవ్రత, అత్యంత విషమంగా ఉన్న బాధితులకు వేర్వేరుగా చికిత్స అందిస్తామని వివరించారు.